మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ, అప్పటివరకూ వెయిట్ చెయ్యాల్సిందేట
హైదరాబాద్: బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎప్పుడు హీరోగా లాంచ్ చేస్తాడా అని నందమూరి అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై బాలకృష్ణ కూడా ప్రత్యేక శ్రద్ద కనపరుస్తున్నారు. సరైన కథ, సమయం రాగానే లాంచ్ చేయాలని ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సమయం ఎప్పుడు అన్నది బాలయ్య క్లారిటీ ఇఛ్చారు.
కృష్ణా పుష్కరాల సందర్భంగా బాలకృష్ణ దంపతులు విజయవాడ దుర్గాఘాట్లో పుష్కరస్నానమాచరించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ విషయమై మీడియావారు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
బాలకృష్ణ మాట్లాడుతూ...మోక్షజ్ఞ తప్పకుండా సినిమాలు చేస్తాడని, కాకపోతే ప్రస్తుతం చదువుపైనే శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. చదువు పూర్తయ్యాక రావాలనే ఆలోచనలోనే మోక్షజ్ఞ ఉన్నట్లు తెలిపారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది చివరకు సినిమాల్లో పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇక తెలుగువారికి అమరావతి ప్రాశస్త్యం పరిచయం చేసేందుకు 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా తీస్తున్నట్లు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు.
బాలయ్య కంటిన్యూ చేస్తూ...'గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా 40శాతం చిత్రీకరణ పూర్తయింది. కథ చాలా గొప్పది ఎన్నో కథలు వింటున్న సమయంలో ఈ కథ విన్నా. ఓ రకంగా చెప్పాలంటే ఇలాంటి కథ దొరకడం నా అదృష్టం. అశోకుడు, శ్రీకృష్ణ దేవరాయులు వీళ్లందరూ గొప్ప గొప్ప రాజులే కానీ మన తెలుగువాడు శాతకర్ణి గురించి మన వాళ్లకు తక్కువ తెలుసు.
అటువంటి మహారాజు పాత్ర పోషిస్తున్నందుకు ఆ సినిమాని ప్రజల ముందుకు తీసుకొస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే దర్శకుడు క్రిష్, సినిమా నిర్మాత శ్రీనివాస్, రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబుకి అభినందనలు' అని అన్నారు.


Click it and Unblock the Notifications











