చివరి సినిమా ప్రకటించిన దాసరి... పవన్ కళ్యాణ్ తో ఎప్పుడో?
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణ రావు తన చివరి సినిమా ప్రకటించారు. చివరగా పౌరాణిక చిత్రం చేయబోతున్నానని, మహాభారతం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని దాసరి నారాయణ రావు ప్రకటించారు.
'మహాభారతంలోని ఐదు పార్టుల సిరీస్ తో ఓ సినిమా చేస్తున్నాను. ఇప్పటికే రెండు పార్టులకు సంబంధించి స్క్రిప్టు వర్క్ కూడా పూర్తయింది. మిగతావి పూర్తి కావాల్సి ఉంది. ఇదే నా చివరి సినిమా. ఈ సినిమా తర్వాత ఇక సినిమా చేయను' అని దాసరి నారాయణరావు తెలిపారు.
దీంతో పాటు కొత్త నటీనటులతో ఓ లవ్ స్టోరీ కూడా తీయబోతున్నట్లు దాసరి తెలిపారు. 'కొత్త నటీనటులతో ఒక సెన్సబుల్ లవ్ స్టోరీ చేయాలనుకుంటున్నాను. ఈ జనరేషన్ కు తగిన విధంగా సినిమా ఉంటుంది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంతో సినిమా సాగుతుంది. కొత్త నటీనటులతో ఈ సినిమా చేస్తాను. నటీనటుల ఎంపిక జరుగాల్సి ఉంది' అన్నారు.

కెరీర్లో ఇప్పటి వరకు 150 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న దాసరి నారాయణరావు రేపు(మే 4)న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అభిమానుల సమక్షంలో దాసరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగబోతున్నాయి. దాసరి శిష్యులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్తో సినిమా ఎప్పుడు?
దాసరి నారాయణ రావు ఆ మధ్య పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడం లేదు కానీ... స్వయంగా నిర్మిస్తున్నారు. ఆ మధ్య ఈ సినిమా గురించి ప్రకటించి హడావుడి చేసిన దాసరి నారాయణరావు...ఇపుడు ఆ సినిమా ఊసే ఎత్తడం లేదు. అసలు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందా? లేదా? అనే విషయమై ఓ క్లారిటీ ఇస్తే బావుంటుందని అంటున్నారంతా...!


Click it and Unblock the Notifications











