స్టేజీపై దేవిశ్రీప్రసాద్ హర్ట్ అయ్యి..బోయపాటిని
హైదరాబాద్: లెజెండ్' చిత్రం విజయోత్సవాన్ని గురువారం రాత్రి హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోయపాటి శ్రీను, దేవిశ్రీప్రసాద్ మధ్య ఆసక్తికరంగా మాటల పరంపర జరిగింది. సినిమాకి సంగీతమదించిన దేవిశ్రీప్రసాద్ గురించి బోయపాటి శ్రీను మాట్లాడుతూ దేవిని హర్ట్ చేసారు. దానికి వెంటనే అదే స్టేజిపై దేవి సమాధానమిచ్చారు. ఆ వివరాలు...
బోయపాటి మాట్లాడుతూ...''సినిమా అంతా తీసి దేవిశ్రీప్రసాద్ చేతిలో పెట్టాం. 14 రోజులు ఆయన చెన్నైలో నేపథ్య సంగీతమందించారు. ఆ సమయంతా ఆయనతోనే ఉండి పని చేయించుకున్నాను. తర్వాత హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ఫైనల్ మిక్సింగ్ చేయించాం. సాధారణంగా ఆయన ఫైనల్ మిక్సింగ్కి రారు. కానీ నేను ఆయనతో పాటే ఉండి సుమారు 58 గంటల పాటు ఫైనల్ మిక్సింగ్ చేయించాను'' అని అంటుండగా...

దేవిశ్రీప్రసాద్ మైక్ తీసుకొని ''బోయపాటి శ్రీను అంటున్నట్లు నేపథ్య సంగీతమందించిన 14 రోజుల పాటు ఆయన నాతో లేరు. చివరి మూడు రోజులు ఉన్నారేమో. అది కూడా ల్యాప్టాప్లో ఇంగ్లిష్ సినిమాలు చూస్తూ కూర్చొన్నారు. ప్రత్యేకంగా నాతో ఉండి భోజనం, నిద్ర మానేయించి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకరు చెప్తే చేసే దౌర్భాగ్య స్థితి కాదు నాది. నాకు సినిమాలే ప్రాణం. బయట ఎక్కడా తిరగను. నాకు సంగీతం ఒకటే తెలుసు. ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాల్లో నేను పాల్గొనను అనేది అబద్ధం. అది నా బాధ్యత. ఒక సంగీత దర్శకుడి నుంచి ట్యూన్స్ పిండుకున్నాం అంటుంటారు. అవేమైనా పాలా పిండుకోవ డానికి, నేను చెప్పిన విషయాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు'' అన్నారు.
తర్వాత బోయపాటి వివరణ ఇస్తూ ''దేవిశ్రీప్రసాద్ ఎంతో కష్టపడి పని చేశారు. ఈ విషయం చెప్పాలన్నదే నా ఆలోచన. దీన్ని ఆయన వేరేగా తీసుకున్నారు. పూర్తిగా చెప్పనివ్వకుండా మైక్ లాక్కొని మాట్లాడారు'' అన్నారు.


Click it and Unblock the Notifications











