'గగనం చూసే ప్రేక్షకుల్ని హైజాక్ చేస్తామంటున్న’నిర్మాత..!
నాగార్జున ప్రధాన పాత్రలో ఇటీవల 'గగనం' పేరుతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ కొత్త తరహా సినిమా తీసి, సక్సెస్ అయ్యాడు. తెలుగు ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతినిచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్ ను కూడా వెరైటీగా చేసాడు. సినిమా రిలీజ్ కి మూడు రోజుల ముందే ప్రీమియర్స్ వేసి కొత్త ఒరవడి తెచ్చాడు. అంతేకాదు, రిలీజ్ కి ఓ రోజు ముందు చార్టెడ్ ఫ్లైట్ లో హైదరాబాదు నుంచి సినిమా యూనిట్ ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రీమియర్స్ వేసాడు. ఇప్పుడీ ప్రమోషన్ లో భాగంగా మరో అడుగు ముందుకేసి, ప్రేక్షకులకు ఓ థ్రిల్ కలిగించనున్నాడు.
ఈ సినిమా ప్రదర్శితమవుతున్న రాష్ట్రంలోని 10 సెంటర్లలో, ఈ నెల 19 నుంచి ఒక్కో థియేటర్ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం 50 మందిని హైజాక్ చేసి, ప్రేక్షకులకి ఓ థ్రిల్ కలుగజేస్తామని దిల్ రాజు చెబుతున్నాడు. నిన్న(ఫిబ్రవరి 15) హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని చెప్పాడు. హైజాక్ చేసిన వారిని ఏం చేస్తామన్నది ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్ ఉండదనీ, వేచి చూడండనీ అంటున్నాడు. సో... హైజాక్ అవ్వాలనుకునే ప్రేక్షకులు రెడీ అవ్వండి మరి..!


Click it and Unblock the Notifications











