‘జయలలిత'కు బ్రేక్.. అంతుచూస్తాం.. దర్శకుడికి బెదిరింపులు
బెదిరింపులు రావడం వల్ల ఈ చిత్రాన్ని తీయడానికి ఏ నిర్మాత ముందుకు రావడం లేదని, దాంతో ప్రస్తుతం చిత్ర నిర్మాణాన్ని నిలిపివేశామని దర్శకుడు ఫైజల్ సైఫ్ తెలిపారు.
తమిళనాడు మాజీ సీఎం, పురచ్చితలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'అమ్మ' చిత్రం ఆగిపోయింది. ఈ చిత్రం అటకెక్కడానికి కారణం రాజకీయ ఒత్తిడిలేనని చిత్ర దర్శకుడు ఫైజల్ సైఫ్ వెల్లడించారు.

అమ్మ దర్శకుడికి బెదిరింపు కాల్స్
‘జయలలిత బయోపిక్ ను తెరకెక్కిస్తే అంతు చూస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి' అని ఆయన తెలిపారు. తనను బెదిరిస్తున్న వారికి దర్శకుడు ఓ విన్నపం కూడా చేశారు. ‘సినిమా చూడకుండా ఎలాంటి నిర్ణయానికి రావొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను'అని ఫైజల్ అన్నారు. జయలలిత ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా సినిమా తీసున్నట్టు కొందరు అపోహ పడుతున్నారని, తాను అలా ఎందుకు చేస్తానని ఆయన తెలిపారు.

బెదిరింపులతో నిర్మాతలు వెనక్కి..
‘ప్రస్తుతం చిత్ర నిర్మాణాన్ని నిలిపివేశాం. బెదిరింపులు రావడం వల్ల ఈ చిత్రాన్ని తీయడానికి ఏ నిర్మాత ముందుకు రావడం లేదు. ప్రస్తుత పరిస్థితులను బేరిజు వేస్తే ఇక ఆ చిత్రం రూపుదిద్దుకునే అవకాశాలు కనిపించడం లేదు' అని ఫైజల్ అభిప్రాయపడ్డారు. ఫైజల్ గతంలో మై హూ రజనీకాంత్, జిగ్నాస, కమ్ డిసెంబర్ చిత్రాలను రూపొందించారు.

క్లైమాక్స్ దశలో ఆగిన అమ్మ
కొద్ది రోజుల క్రితం సెట్ పైకి వెళ్లిన ఈ చిత్రం క్లైమాక్స్ దశకు చేరుకొన్నది. క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ మిగిలి ఉన్నది. జయలలిత ఆకస్మిక మరణం తర్వాత కథ ముగింపును కూడా దర్శకుడు మార్చేవేశారు. ఈ చిత్రంలో జయలలిత పాత్రను రాగిణి ద్వివేది పోషిస్తున్నది. నారాయణ్, రాజ్పాల్ యాదవ్ తదితరులు నటిస్తున్నారు.

అమ్మ మరణంపై ఎలాంటి విచారణకైనా సిద్ధం
తీవ్ర అనారోగ్యానికి గురైన మాజీ సీఎం జయలలిత ఇటీవల చైన్నైలోని అపోలో హాస్పిటల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం వెనుక ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా అపోలో అధినేత ప్రతాప్ రెడ్డి ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











