ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ తండ్రి కన్నుమూత
ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కొద్దిరోజులుగా కెరీర్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆయనకు ఇప్పుడు మరో కష్టం వచ్చింది. గోపీచంద్ మలినేని తండ్రి వెంకటేశ్వర్లు చౌదరి ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. దీంతో అటు గోపీచంద్ కుటుంబంలో.. ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం అలముకుంది. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మరోవైపు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
కుమారుడు సినిమాల కోసం హైదరాబాద్లో సెటిల్ అయినప్పటికీ, వెంకటేశ్వర్లు చౌదరి మాత్రం స్వగ్రామైన ఒంగోలులోని బొద్దులూరి వారి పాలెంలో నివసిస్తున్నారు. ఇటీవల ఆయనకు ఆరోగ్యం క్షిణించింది. దీంతో ఆయనకు చికిత్స చేయించారు. ఆ తర్వాత కొద్దిరోజులు వెంకటేశ్వర్లు ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది. ఇక, ఇటీవల ఆయన మరోసారి అనారోగ్యం పాలయ్యారట. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది.

శ్రీహరి హీరోగా నటించిన పోలీస్ సినిమాకు సహాయ దర్శకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన గోపిచంద్.. ఆ తర్వాత ఆయనతో నాలుగు సినిమాలకు పనిచేశాడు. అనంతరం ఈవీవీ సత్యనారాయణ దగ్గర రెండు సినిమాలకు, శ్రీను వైట్ల దగ్గర 'అందరివాడు', 'వెంకీ', 'ఢీ' సినిమాలకు వర్క్ చేశాడు. వీటితో పాటు మురుగదాస్ దగ్గర 'స్టాలిన్' సినిమాకు, శ్రీవాస్ దగ్గర 'లక్ష్యం' సినిమాకు, అలాగే మెహర్ రమేష్ దగ్గర 'కంత్రి', 'బిల్లా' సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 'డాన్ శీను' ద్వారా దర్శకుడిగా పరిచయమైన గోపీచంద్.. 'పండగ చేస్కో', 'బలుపు', 'బాడీగార్డ్', 'విన్నర్' సినిమాలు చేశాడు.


Click it and Unblock the Notifications











