తీరని కష్టాలు: మళ్లీ ఇబ్బందుల్లో ‘ఆటో నగర్ సూర్య’
హైదరాబాద్: నాగ చైతన్య, సమంత జంటగా దేవా కట్ట దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆటో నగర్ సూర్య' ఇప్పటికే విడుదల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఎట్టకేలకు ఈ నెల 27న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కష్టాల నుండి బయటపడి విడుదల ఖాయమనే అనుకున్న ఈచిత్రం మళ్లీ ఇబ్బందుల్లో పడింది. జులై 10వ తేదీ వరకు చిత్రాన్ని విడుదల చేయొద్దంటూ గుంటూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో విడుదల చేద్దామని పలు సందర్భాల్లో నిర్మాతలు ప్రయత్నాలు చేసినప్పటికీ వివిధ రకాల ఇబ్బందులు, కోర్టు సమస్యలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా విడుదలకు సిద్ధమైనా మళ్ళీ కోర్టు చిక్కులు చుట్టు ముట్టాయి.

ప్రస్తుతం 'ఒక లైలా కోసం' సినిమా షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ లో పాటలు పాడుకుంటున్న నాగచైతన్యకు ఇది మళ్ళీ షాకింగ్ న్యూస్. చైతన్యను మాస్ హీరోగా రాణిస్తే చూడాలి అని ముచ్చట పడుతున్న నాగార్జునను కూడా తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు అసంతృప్తికి గురి చేస్తున్నాయి.
గతంలోనూ కోర్టు ఇబ్బందులు..
ఈ మూవీ నిర్మాణానికి సంబంధించి ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన సమస్యల కారణంగా షేక్ అబ్డుల్ మహ్మద్ అనే వ్యక్తి నిర్మాత, సినిమాపై గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కేసు విచారణలో భాగంగా కోర్టు మార్చి 18, 2014 వరకు విడుదల చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. నిర్మాత అచ్చిరెడ్డిని కోర్టుకు హాజరు కావాలని కోరింది. 'ఆటోనగర్ సూర్య' మూవీని 'ఆర్ ఆర్ మూవీ మేకర్స్' సమర్పణలో 'మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్' పతాకంపై కె. అచ్చిరెడ్డి నిర్మించాడు. దీనిలో అబ్దుల్ అనే వ్యక్తి రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాడని శాంతా అనే లాయర్ తెలిపారు. ఈ డబ్బులు తిరిగి చెల్లించే విషయంలో ప్రొడక్షన్, నిర్మాత తనను మోసం చేశారని అబ్దుల్ ఆరోపించారు. ఇదంతా గతం. తాజాగా మళ్లీ గుంటూరు కోర్టు 'ఆటో నగర్ సూర్య' చిత్రం జూన్ 27న విడుదల నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.


Click it and Unblock the Notifications











