చూసి, నా పేరు వాడుకోమని చెప్పాను: దిల్ రాజు
హైదరాబాద్: బొమ్మరిల్లు, ఆర్య, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్తబంగారు లోకం, ఇలా ఎన్నో సూపర్ హిట్స్ తీసిన దిల్ రాజు బ్యానర్ అనగానే ఓ లుక్ , గౌరవం ఉంది ప్రేక్షకులలో...ఆ రకమైన బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత ఏ అడుగు వేసినా అన్ని జాగ్రత్తలూ తీసుకుని ముందుకు వెళ్లాలి. దిల్ రాజు అదే పనిచేస్తున్నారు. తాజాగా అదే విషయాన్ని ఆయన తెలియచేసారు.
సుకుమార్ నిర్మించిన...కుమారి 21 ఎఫ్ చిత్రంతో యువ ప్రేక్షకులను ఆకట్టుకున్న హెభా పటేల్ తాజాగా నాన్న నేను నా బాయ్ఫ్రెండ్స్ అంటూ సందడి చేయబోతుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి భాస్కర్ బండి దర్శకుడు. రావు రమేష్, అశ్విన్బాబు, పార్వతీశం ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. దిల్రాజు విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా టీజర్ రిలీజ్ సందర్బంగా కొన్ని విషయాలు మాట్లాడుతూ...ఇదే విషయం ప్రస్దావించారు.

దిల్రాజు మాట్లాడుతూ... తొలుత నేను ఈ సినిమాలో భాగమవుతున్నాననగానే, నీకున్న ఇమేజ్కు ఈ సినిమా సరికాదని శ్రేయోభిలాషులు చెప్పారు. కానీ సినిమా చూసిన తర్వాత నా నిర్ణయం మారింది. సినిమాను నేనే విడుదల చేయడంతో పాటు టైటిల్స్లో నా పేరు వేసుకోమని చిత్ర యూనిట్ కి సూచించాను. ప్రతి తండ్రిని, కూతురిని కదిలించే కథ ఇది అన్నారు.
ఇక హైదరాబాద్లో ఈ చిత్ర టీజర్ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
వినాయక్ మాట్లాడుతూ... భాస్కర్ నాకు ఆత్మీయుడు. నా మనసుకు దగ్గరైన వ్యక్తి. దిల్రాజు విడుదల చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ... నిర్మాతగా దిల్రాజు నాకు స్ఫూర్తి. ఆయన ఈ సినిమా చూసి బాగుందని చెప్పిన తర్వాతే ఇన్నాళ్లు నేను పడిన టెన్షన్ మొత్తం దూరమైంది అని బెక్కెం వేణుగోపాల్ చెప్పారు. 'నాన్న, నేను నా బాయ్ఫ్రెండ్స్ సినిమా కథ కోసం దాదాపు యేడాదిగా కసరత్తులు చేశాం. ఇది యూత్ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ కథను ముందు ప్రముఖ నిర్మాత దిల్ రాజుగారికి వినిపించాం. ఆయన కథ విని కొన్ని మార్పులు చేయమని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే కథలో మార్పులు చేసి సినిమా తీశాం. ఫస్ట్ కాపీ చూసి దిల్ రాజు సినిమా చాలా బావుందని అభినందించారు.

గతంలో మా బ్యానర్లో వచ్చిన సినిమా చూపిస్త మావ సినిమా చూసిన రాజు సినిమా నచ్చడంతో నైజాం హక్కులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు నాన్న, నేను నా బాయ్ఫ్రెండ్స్ సినిమా చూసి బాగా నచ్చడంతో సినిమాకు సంబంధించిన మొత్తం హక్కులను మంచి ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు.
ఇలా రాజు కంటెంట్పై నమ్మకంతో విడుదల చేసిన హ్యాపీడేస్, పటాస్ వంటి చిత్రాలు ఘన విజయాలను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాన్న, నేను నా బాయ్ఫ్రెండ్స్ సినిమా విషయంలో అంతే కాన్ఫిడెంట్గా ఉన్నాం. త్వరలోనే ఆడియో, సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పుకొచ్చారు.
ముగ్గురు అబ్బాయిలు, ఓ అమ్మాయి మధ్య సాగే ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెభాపటేల్, తేజస్వి, ప్రసన్న, నోయల్, శేఖర్చంద్ర తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











