బ్యాంకాక్ పేలుళ్లు .... నటి జెనీలియా క్షేమం
బ్యాంకాక్: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లోని ప్రఖ్యాత బ్రహ్మ దేవాలయం ప్రాంగణంలో సోమవారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 27 మంది మరణించారు. వీరిలో నలుగురు విదేశీయులు కూడా ఉన్నారు. 117 మంది గాయపడ్డారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
పేలుడు జరిగినప్పుడు బాలీవుడ్ నటి జెనీలియా.. అక్కడికి చేరువలోని ఒక మాల్లో ఉన్నారు. ఒక యాడ్ షూటింగ్ నిమిత్తం ఆమె అక్కడికి వెళ్లారు. తాను సురక్షితంగానే ఉన్నట్లు ఆమె ట్విటర్లో పేర్కొన్నారు.
థాయ్లాండ్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి. పేలుడు వల్ల ఆలయానికి ఎలాంటి నష్టం కలగలేదు. బాధితుల్లో భారతీయులెవరూ లేరు. నగరంలోని వాణిజ్య ప్రాంతమైన చిద్లాం జిల్లాలో ప్రధాన మార్గంపై ఈ ఎరవాన్ ఆలయం ఉంది. దీన్ని స్థానికంగా ఫ్రా ఫ్రోమ్ దేవాలయంగా పిలుస్తుంటారు. ఆ చుట్టుపక్కల మూడు ప్రధాన షాపింగ్ మాల్స్, అంతర్జాతీయ హోటళ్లు ఉన్నాయి. బ్యాంకాక్లో అత్యంత ఆకర్షణీయ పర్యాటక ప్రాంతాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడికి తూర్పు ఆసియా పర్యాటకులు, స్థానిక బౌద్ధులు ఎక్కువగా వస్తుంటారు.

తాజా పేలుడులో భారతీయులెవరూ గాయపడలేదని థాయ్లాండ్లో భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. తాము స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని చెప్పారు. బ్యాంకాక్లో బాంబు దాడులు చాలా అరుదు. 2012లో జరిగిన వరుస పేలుళ్లలో ఐదుగురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ దౌత్యాధికారులను హత్య చేయడానికి ఇరాన్ వాసులు ఆ పేలుళ్లు జరిపినట్లు థాయ్ అధికారులు అప్పట్లో తెలిపారు.
తాజా ఘటనకు ఏ సంస్థా బాధ్యత వహించలేదు. దక్షిణ భాగంలో ఉన్న ముస్లిం వేర్పాటువాదులు, అధికారం కోసం పోరాడుతున్న రాజకీయ ముఠాలపై అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినట్లు వస్తున్న వదంతులు నిజం కాదని థాయ్ ప్రధాని ప్రయుత్ చాన్ ఓ చా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











