నా చిత్రం 'శివ' చూసి అంటూ ... అక్కినేని గురించి వర్మ
హైదరాబాద్: ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వర రావు మృతి పట్ల యావత్ సినీ ప్రపంచం తనదైన రీతిలో విషాద హృదయంతో స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తనకి దర్శకుడుగా జీవితాన్ని ఇచ్చిన శివ చిత్రం నిర్మించిన అక్కినేని నాగేశ్వరరావు మృతికి రామ్ గోపాల్ వర్మ చలించారు. ఆయన తనదైన శైలిలో ట్విట్టర్ లో స్పందించి సంతాపం తెలియచేసారు.
వర్మ ట్వీట్ చేస్తూ... నేను ఇప్పటికీ మరవలేను..ఆయన నా తొలి చిత్రం శివ మొదటి కాపీ చూసి భుజంపై చెయ్యవేసి అభినందించటం అన్నారు. అలాగే ...మిగతావన్నీ ఎలా ఉన్నా నాగేశ్వరరావుగారు తెలుగు చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ కి తేవటంలో ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి అని సంతాపం తెలియచేసారు.
ఇక నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో ముగిసాయి. అక్కినేని వారసులు వెంకట్, నాగార్జున, సుమంత్, నాగ చైతన్య, సుప్రియ, అఖిల్ తదితరులు ఈ అంత్యక్రియల క్యార్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కినేనికి గన్ సెల్యూట్ చేసారు. అంతకు ముందు ఏపీ ఫిల్మ్ చాంబర్ నుండి అక్కినేని పార్తివ దేహాంతో అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో వేలాది మంది అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు, సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అక్కినేని నగరంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం అర్థరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 2-45 నిముషాలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా వెంకటరాఘవ పురంలో 1924 సెప్టెంబర్ 20న ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన అక్కినేని వయస్సు 91 సంవత్సరాలు. 1944లో సినీ ప్రస్థానం మొదలెట్టిన నాగేశ్వరరావు తొలి చిత్రం ధర్మపత్ని. చివరి చిత్రం మనం. ఆయన ధరించిన ఎన్నో పాత్రలు చిరస్మరణీయాలై మిగిలిపోయాయి.


Click it and Unblock the Notifications












