అన్ని కోట్లు ఎక్కడివి?.... మహేష్ '1' మూవీ నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు
హైదరాబాద్: మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' చిత్రం నెల 10న గ్రాండ్ గా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. రూ. 60 నుంచి 70 కోట్లు కోట్ల బడ్జెట్తో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మించింది. కాగా....ఈ చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయాలపై, నిర్మాతల ఇళ్లపై ఐటీ అధికారులు బుధవారం సాయంత్రం దాడులు చేసారు. కార్యాలయం, నిర్మాతల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.
మహేష్ బాబు లాంటి వారితో సినిమా నిర్మాణం అంటే కోట్లలో వ్యవహారం. మరి నిర్మాతలకు ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? సర్వీస్ టాక్స్ క్లియర్ చేసారా? టీడీఎస్ సక్రమంగా కట్టారా? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలకు ఇప్పటి వరకు '1' సినిమాకు సంబంధించి వివిధ రైట్స్ రూపంలో రూ. 80 కోట్ల మేర వచ్చినట్లు అంచనా.
పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు విడుదల అవుతున్నాయంటే ఇలాంటి దాడులు జరుగడం మామూలే. గతంలో దూకుడు సినిమా సమయంలోనూ ఈ సంస్థపై దాడులు జరిగాయి. అయితే ప్రత్యేకంగా సినిమా విడుదల ముందు ఇలాంటి దాడులు చోటు చేసుకోవడం చర్చనీయాంశం అయింది.
సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోన్న మహేష్ బాబు '1-నేనొక్కడినే' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. U/A సర్టిఫికెట్ జారీ కావడం ద్వారా ఈచిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడొచ్చని స్పష్టమవుతోంది.
ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. ఈచిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్తో తెరకెక్కించింది.


Click it and Unblock the Notifications












