కాస్త లేటైనా విషయం అర్దమై ట్వీటాడు
హైదరాబాద్ : సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ కు దూరంగా ఉంటూ వస్తున్న హీరో, విలన్ జగపతి బాబు. తనకి కంప్యూటర్ కూడా లేదని గతంలో చెప్పిన ఆయనకి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ విలువ తెలిసి వచ్చినట్లుంది. ట్వీట్స్ ద్వారా ఎప్పుడూ జనాల్లో ఉండే వారి వైపే సిని ప్రపంచం చూస్తోందనే విషయం అర్దం చేసుకున్నారు. అభిమానులతోనూ నిత్యం టచ్లో ఉండడానికి ట్విట్టర్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు జగపతి. @IamjagguBhai పేరుతో ఆయన ట్విట్టర్ ఖాతా తెరిచారు.
''లెజెండ్ తరవాత వరుస అవకాశాలతో వూపిరాడడం లేదు. వచ్చిన వాటిలో మంచివే ఎంచుకొంటున్నా. నన్ను కొత్తగా చూపించడం కోసం దర్శకులు చేస్తున్న ప్రయత్నాలు సరికొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. నా అభిమానులకు నేను సరికొత్తగా కనిపించడం.. మరింతగా నచ్చుతోంది. ట్విట్టర్ ద్వారా వాళ్లతో ఎప్పుడూ టచ్లో ఉంటా..'' అంటున్నారు జగపతిబాబు.

'లెజెండ్'లో జగపతిబాబు జితేంద్రగా అలరించి, పూర్తి బిజీ ఉన్న నటుడుగా మారుతున్నారు. తన బ్యాడ్ పిరియడ్ అయ్యిపోయిందని భావిస్తున్నారు. 'రా రా కృష్ణయ్య', 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇవికాక మరో మూడు చిత్రాలు అంగీకరించారు. జగపతిబాబు ఎప్పుడైతే.. అన్నిరకాల పాత్రలకూ తలుపులు తెరిచారో, దర్శకుల తలపులు కూడా మారాయి. జగపతి కోసం కొత్త పాత్రలు పుడుతున్నాయి.
జగపతి బాబు మాట్లాడుతూ... ఇప్పటికే హీరోగా నా కెరీర్ అయిపోయింది. నా మార్కెట్ పడిపోయింది. నటుడిగా నాకు విలువ ఉందన్న సంగతి నాకు తెలుసు. అందుకే ముందడుగు వేశా. నిజానికి ఇది మామూలు కమర్షియల్ సినిమాల్లో కనిపించే ప్రతినాయకుడి పాత్ర కాదు. నా పాత్రపై ప్రేక్షకుల్లో అంతో ఇంతో సానుభూతి కలుగుతుంది. అది ఒకవిధంగా ప్లస్ అయ్యింది. నా గెటప్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకొన్నా. ఇటాలియన్ లుక్లో కనిపించా. ఆ కాస్ట్యూమ్స్ నాకు నేనుగా డిజైన్ చేసుకొన్నా అన్నారు.


Click it and Unblock the Notifications











