పవన్ వాయిస్ తో 'జనసేన' యూత్ సాంగ్ (వీడియో)
హైదరాబాద్: విశాఖలో ఈ నెల 27న జరిగే జనసేన యువభేరిని పురస్కరించుకుని ఆ పార్టీ మంగళవారం ప్రత్యేక గీతాన్ని విడుదలచేసింది. 'చకచక ఎగిరే పక్షులకు సైతం ఫ్రీడం ఎంతో ఉంది... మన దేశంలో అన్నం పెట్టే రైతన్నకు ఫ్రీడం లేనేలేదు..' అంటూ ఈ గీతం మొదలవుతుంది. ఇందులో దేశంలో రైతన్నకు కరవైన స్వేచ్ఛ, యువతులకు రక్షణ లేకపోవడం, చిన్నారులకు విద్య అందుబాటులో లేకపోవడం లాంటి విషయాలను ప్రస్తావించారు. రాజకీయాల్లో కుళ్లు కడిగేయాలనీ, అన్యాయాన్ని ఎదురించాలని పిలుపునిచ్చారు. దీనికి జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కళ్యాణ్ నేపథ్య గళం అందించారు. ఈ పాట అభిమానుల్లోకే కాక అందరిలోకూ చొచ్చుకుపోతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక 'జనసేన' పార్టీకి సంబంధించిన భారీ బహిరంగ సభ ఈ నెల 27వ తేదీన విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సభను ప్రజలు, అభిమానులు భారీగా తరలి రావాలని పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడి పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా వెలిసాయి. ఈ సభకు దాదాపు 5 లక్షల నుండి 6 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 'యూత్ ఫర్ నేషన్, ఫైట్ ఫర్ నేషన్' అనే నినాదంతో సాగే ఈ భారీ బహిరంగ సభ....27వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సభలో పార్టీకి సంబంధించిన విధి విధానాలు, లక్ష్యాలు, ఇతర అంశాలపై పవన్ కళ్యాణ్ స్పష్టంగా వివరిస్తారు.

తొలి బహిరంగ సభను విశాఖపట్నంలో నిర్వహించిన తర్వాత... వివిధ అంశాల వారీగా జనంలోకి వెళ్లాలని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ నిర్ణయించారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు... ఇలా ఆయా వర్గాల వారితో మమేకమై, వారి సమస్యలు తెలుసుకుంటారు. ప్రతీ వారం, పది రోజులకు ఏదో ఒక కార్యక్రమం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
విశాఖ సభ అనంతరం రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లోని ముఖ్య కేంద్రాల్లోనూ ఇలాంటి సభలే నిర్వహించాలని భావిస్తున్నారు. ఈనెల 27న విశాఖపట్నంలో నిర్వహించే సభకు అభిమానులతోపాటు విద్యార్థులు, యువత నుంచి అనూహ్య స్పందన వస్తున్నట్లు పవన్ సన్నిహితులు తెలిపారు.
శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు సభలో పాల్గొంటామని సమాచారం పంపుతున్నట్లు చెప్పారు. ఈసారి పాసులతో పనిలేకుండా, అందర్నీ సభకు అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు 'యూత్ ఆఫ్ ది నేషన్-ఫైట్ ఫర్ ది నేషన్' అని సభకు ట్యాగ్లైన్ పెట్టారు. ఇందు కోసమే రూపొందించిన ప్రత్యేక లోగో, గీతాన్ని సోమ, మంగళవారాల్లో ఆవిష్కరించనున్నారు.
తన స్నేహితుడు రాజు రవితేజతో కలిసి పవన్ రచించిన 'ఇజం' పుస్తకాన్ని విశాఖ సభలో ఆవిష్కరిస్తారు. కాగా, సోమవారం వివిధ ప్రాంతాల్లో మోటారు సైకిళ్లతో ర్యాలీలు నిర్వహించాలని పవన్ అభిమానులు నిర్ణయించారు. సభలో ఆవిష్కరించేందుకు భారీ జాతీయ పతాకాన్ని ఓ అభిమాని రూపొందిస్తున్నారు. పీవీపీ సంస్థ ప్రతినిధులు ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/ky8dfKFmomw" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications











