శేఖర్ సినిమా వివాదం.. జీవితా రాజశేఖర్కు కోర్టులో ఊరట.. ఫైనాన్షియర్కు ఎదురుదెబ్బ?
శేఖర్ మూవీ వివాదంలో మునిగి తేలడం సినీ వర్గాలను ఆందోళనకు గురి చేసింది. అప్పుల బారిన పడిన రాజశేఖర్ కుటుంబం ఈ సినిమాపై ఆశలు పెట్టుకొని థియేట్రికల్ రిలీజ్ చేసింది. అయితే రిలీజ్ తర్వాత ఫైనాన్సియర్ పరంధామరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సినిమాను నిలిపివేశారు. ఈ క్రమంలో జీవిత రాజశేఖర్ కోర్టును ఆశ్రయించగా ఆమెకు ఊరట లభించింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

శేఖర్ వివాదంపై నిర్మాత
శేఖర్ వివాదంపై నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి స్పందిస్తూ.. శేఖర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాను. జీవితా రాజశేఖర్ మా చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజశేఖర్ కథానాయకుడిగా నటించారు. వాళ్లిద్దరి పారితోషికాలు పూర్తిగా చెల్లించాను. ఈ సినిమా రాజశేఖర్, జీవితది అనుకుని ఎవరో కోర్టుకు వెళ్లారు. నా సినిమాకు వాళ్ళు నష్టం కలిగిస్తే పరువు నష్టం దావా కేసు వేస్తా. నేను నష్టపోయిన మొత్తాన్ని వాళ్ళ నుంచి రాబడతా. నా సినిమాను ఎవరికీ అమ్మకూడదని ఏదో చెబుతున్నారు. అది చెల్లదు. ఎందుకంటే... అసలు నిర్మాతను నేను'' అని చెప్పారు.

హీరో రాజశేఖర్ ఆవేదనతో
ఇక రాజశేఖర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. శేఖర్ సినిమాకు మంచి ఆదరణ దక్కుతున్నది. కొందరు మా విజయాన్ని జీర్ణించుకోలేక సినిమాను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. శేఖర్ సినిమాను ఆపడం సరికాదు. ప్రేక్షకుల ఆదరణకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని రాజశేఖర్ అన్నారు.

ఫైనాన్సియర్ ప్రకటనతో గందరగోళం
నిర్మాత, హీరో రాజశేఖర్ రియాక్షన్ తర్వాత ఫైనాన్సియర్ పరంధామరెడ్డి స్పందించారు. శేఖర్ సినిమా ప్రదర్శన అన్ని ప్రాంతాలలో ఆగిపోయింది. ఈ చిత్రం ప్రదర్శనలను కోర్టు ఆదేశాలను అనుసరించి థియేటర్ల నిర్వాహకులు ఆదివారం నిలుపుదల చేశారు. తన దగ్గర 65,00,000/- (అరవై ఐదు లక్షల రూపాయలు) అప్పుగా తీసుకున్న నిర్మాత,దర్శకురాలు శ్రీమతి జీవిత రాజశేఖర్ తిరిగి చెల్లించకపోవడంతో తాను హైదరాబాద్ లోని గౌరవనీయ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాను అని పరంధామరెడ్డి తెలిపారు.

కోర్టు ఆదేశాలు ఇవే అంటూ
పరంధామరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు స్పందించింది. అయితే 48 గంటలలోగా అంటే ఆదివారం సాయంత్రం 4-30 గంటలు లోగా Rs. 65,00,000/- (అరవై ఐదు లక్షల రూపాయలు) సెక్యూరిటీ డిపాజిట్ కోర్టులో శ్రీమతి జీవిత రాజశేఖర్ సమర్పించాలి. ఒకవేళ అలా డిపాజిట్ చేయలేని పక్షంలో శేఖర్ సినిమాకు సంబందించిన సర్వ హక్కులను (నెగటివ్ రైట్) అటాచ్ మెంట్ చేస్తూ అనగా థియేటర్స్ లో కానీ డిజిటల్, శాటిలైట్, ఓటీటీ, ఎటీటీ, యూట్యూబ్ వంటి వివిధ రకాల ఫ్లాట్ ఫామ్స్ లో సినిమాతోపాటు ట్రైలర్స్ ,పాటలతోసహ ఎలాంటి కంటెంట్ ఎక్కడా ప్రసారం చేయకుండా నిలుపుదల చేస్తూ, కోర్టు ఆదేశాలు జారీ చేసిందని పరంధామరెడ్డి వివరించారు.

కోర్టును ఆశ్రయించిన జీవిత
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన 'శేఖర్' గత శుక్రవారం విడుదలైంది. అయితే, ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా సినిమా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్రబృందం కోర్టును ఆశ్రయించారు.

కోర్టులో ఫైనాన్షియర్కు ఎదురుదెబ్బ
అయితే ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వివరణ తర్వాత జీవిత రాజశేఖర్, ఇతర సినిమా సభ్యుకు అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్టు తెలుస్తోంది. 'శేఖర్' సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించారు. అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చు అని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications











