గొడ్డలితో దాడి: కోన, దానయ్య దోపిడి- శ్రీను వైట్ల, తమన్ ఎస్కేప్!
హైదరాబాద్: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరుగి వస్తుండగా సినీ రచయిత కోన వెంకట్, నిర్మాత డివివి దానయ్య దారి దోపిడీకి గురయ్యారు. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల, తమన్ తృటిలో తప్పించుకున్నారు. హైదరాబాద్ శివారు షాద్ నగర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దుండగులు వీరి కారుపై గొడ్డళ్లతో దాడి చేయడం గమనార్హం.

షాద్ నగర్లో ప్రకాష్ రాజ్ ఫాం హౌస్లో ఆయన జన్మదిన వేడుకలు మార్చి 26న రాత్రి జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. పార్టీ అనంతరం దానయ్య, కోన వెంకట్, ప్రవీణ్ అనే మరో వ్యక్తి డ్రైవర్ సుబ్రహ్మణ్యంతో కలిసి ఒక కారులో బయల్దేరారు. నూర్ కళాశాల దగ్గరగల కల్వర్టు దగ్గరకు రాగానే రెడ్డు అడ్డంగా చెట్టు ఉండటంతో కారు ఆపారు. ఇంతలో ఇద్దరు గొడ్డళ్లతో వచ్చి కారు అద్దాలు పగులగొట్టారు. డ్రైవర్ పై దాడి చేసారు. కోన వెంకట్, దానయ్యలను బెదిరించి వారి మెడలోని బంగారు గొలుసులు, చేతికున్న ఉంగరాలు, డ్రైవర్ దగ్గరున్న రూ. 1500 దోచుకెళ్లారు.
వీరి వెనకనే మరో కారులో వస్తున్న తమన్, శ్రీను వైట్ల ఈ దాడి సంఘటన గమనించి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ దాడి సంఘటన సినీ రంగంలో చర్చనీయాంశం అయింది. ప్రముఖులపై ఇలాంటి దాడి జరుగడం పలువురిని భయాందోళనకు గురి చేస్తోంది.
రోడ్డుకు అడ్డంగా చెట్టు ఉండటం బట్టి....దుండగులు పథకం ప్రకారమే దారి దోపిడీ చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రకాష్ రాజ్ ఫాం హౌస్ లో పార్టీ జరుగుతుందనే విషయం గమనించి.....రోడ్డుపై కాపుకానిసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో పలువురు సినీ ప్రముఖులు ఫాం హౌస్ పార్టీలంటేనే భయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











