లెజెండ్ శాటిలైట్ రైట్స్: రూ. 5 కోట్లు రావడం కూడా కష్టమే!
హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 'లెజెండ్' చిత్రం విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా నిర్మాతలకు భారీగా దెబ్బపడే అవకాశం కనిపిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. లెజెండ్ చిత్రం శాటిలైట్ రైట్స్ను దక్కించుకునేందుకు మాటీవీ, జెమినీ టీవీ పోటీ పడి రూ. 7 కోట్ల వరకు చెల్లించేందుకు రెడీ అవ్వగా, నిర్మాతలు రూ. 8.5 కోట్లు డిమాండ్ చేసారని, అయితే ఉన్నట్టుండి పరిస్థితులు మారడంతో రూ. 5 కోట్లు వచ్చే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతోంది.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ గంటలో 12 నిమిషాలు మాత్రమే ప్రకటనలు ఇవ్వాలనే ప్రతిపాదనల కారణంగా....ముందు 7 కోట్లు ఇస్తామని చెప్పిన జెమినీ టీవీ వెనక్కి తగ్గిందని, ఈ పరిణామాల నేపథ్యంలో మాటీవీ వారు కూడా తమ రేటు తగ్గించి రూ. 4.5 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలేమని తేల్చి చెప్పినట్లు సమాచారం.
శాటిలైట్ రైట్స్ విషయంలో తాము ఆశించిన మొత్తం రాక పోయినా.....'లెజెండ్' సినిమాను దక్కించుకోవడానికి ఏరియావైజ్ డిస్ట్రిబ్యూటర్లు భారీగా పోటీ పడుతున్నారట. 'సింహా' లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన 'బాలయ్య-బోయపాటి' కాంబినేషన్ కావడంతో ఈచిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
అభిమానుల అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంటే....'లెజెండ్' చిత్రం రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు. ఈచిత్రంలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications












