ఓకే చెప్పిన మహేష్ బాబు... అసిస్టెంటనా? మంత్రి మేనల్లుడనా?
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత బిజీయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు సినిమాల షూటింగులు, మరో వైపు వాణిజ్య ప్రకటనల ప్రమోషన్స్తో తీరిక లేకుండా గడుపుతుంటారు. అందుకే ఆయన ఖాళీ సమయం దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకే ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కార్యక్రమాలకు ఆయన హాజరయ్యేది చాలా అరుదు.
తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన 'హృదయం ఎక్కడున్నది' చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కుమారి మేనల్లుడు కృష్ణ మాధవ్ హీరోగా పరిచయం అవుతున్నారు. కన్నడ భామ అనూష, మళయాల భామ సంస్కృతి షినోయ్ హీరోయిన్లు.
అమెరికాలో చదువుకున్న కృష్ణ మాధవ్ సినిమాల పట్ల ఆసక్తితో ఈ రంగంలో అడుగు పెట్టారు. గతంలో ఆయన మహేష్ బాబు నటించిన పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేసారు. వీరి మధ్య బంధుత్వం కూడా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. పైగా మంత్రి గల్లా అరుణ కుమారి మేనల్లుడు కూడా. ఈ పరిణామాల నేపథ్యంలో మహేష్ బాబు ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావడం చర్చనీయాంశం అయింది.
రేపు (నవంబర్ 26) హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో 'హృదయం ఎక్కడున్నది' చిత్రం ఆడియో వేడుక జరుగనుంది. పవన్, సంజయ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ శిష్యుడు వి. ఆనంద్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దగ్గర అసిస్టెంటుగా పని చేసిన విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ బెన్ హుడ్సన్ వద్ద శిష్యరికం చేసిన ప్రసాద్ జి.కె సినిమాగ్రఫీ అందిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, ఆహుతి ప్రసాద్, ధన్ రాజ్, పృథ్వి, ఫణి, రజిత, అనత్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications












