ప్రత్యేక విమానంలో మహేష్ బాబు చక్కర్లు?
హైదరాబాద్: సినిమా ప్రచారంలో ప్రధానమైన ఘట్టం ఆడియో విడుదల కార్యక్రమం. అందుకే మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న '1'(నేనొక్కడినే) చిత్రం ఆడియోని వినూత్నంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఆడియోను డిసెంబర్ 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రం ఆడియో వేడుక రాష్ట్రంలోని మూడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలలో ఒకేసారి విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక విమానంలో ఈ మూడు చోట్లకు అరగంట వ్యవధిలో మహేష్ బాబు ప్రయాణిస్తారని సమాచారం. ఆడియో వేడుక వినూత్నంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని సంక్రాంతి పండగను పురస్కరించుకుని జనవరి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో పలు అంశాలు మహేష్ బాబు అభిమానులను ఆశ్చర్య పరచనున్నాయి. యాక్షన్ సీక్వెన్స్లో VFX వర్క్ ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. కొన్ని స్పెషల్ ఎఫెక్టుల కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈచిత్రానికి పని చేసారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు. యూనిట్ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కాన్రాడ్ పాల్మిసానో ఆధ్వర్యంలో మహేష్ బాబు పలు ఫైట్ సీన్లు, చేజింగ్ సీన్లు అద్భుతంగా చేసారని స్పష్టమవుతోంది.
మహేష్ బాబు-క్రితి సానన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. తెలుగులో పలు చిత్రాలకు హిట్ మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా మహేష్ బాబు చిత్రానికి పని చేస్తున్నారు. రోబో లాంటి చిత్రాలకు పని చేసిన ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈచిత్రానికి పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












