సంజయ్ దత్ తల్లిగా మనీషా కోయిరాలా.. మళ్లీ క్యాన్సర్..
ప్రముఖ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటించేందుకు బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఈ బయోపిక్లో సంజయ్ పాత్రలో యువ హీరో రణ్బీర్ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్బీర్ తల్లి పాత్రను మనీషా పోషించనున్నారు. వాస్తవ జీవితంలో సంజయ్ దత్ తల్లి అలనాటి ప్రముఖ నటి నర్గీస్ దత్ అన్న సంగతి తెలిసిందే.

క్యాన్సర్ను ఎదురించి.. మళ్లీ వెండితెరపైకి
90వ దశకంలో మనీషా కోయిరాలా సౌదాగర్, దిల్ సే, బాంబే, గుప్త్, ఒకే ఒక్కడు, క్రిమినల్ చిత్రాలలో తన గ్లామర్తో ప్రేక్షకులను ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. అమెరికాలో చికిత్స పొందిన తర్వాత ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడింది. గత కొద్దికాలంగా సినిమాలకు దూరమైన ఆమె తాజాగా సంజయ్ దత్ బయోపిక్లో నటించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు సమాచారం.

నర్గీస్ దత్ పాత్రలో.. పరేశ్ జంటగా
ఈ బయోపిక్లో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రను ప్రముఖ నటుడు పరేశ్ రావల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో పరేశ్ రావల్ భార్యగా మనీషా కనిపించనున్నారు. కాగా సంజయ్ భార్య మాన్యత దత్ పాత్రను హైదరాబాద్ బ్యూటీ దియామిర్జా పోషించనునున్నారు. ఇంకా ఈ చిత్రంలో సోనమ్ కపూర్ కూడా నటించనున్నారు. ఈ చిత్రానికి పీకే దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు.

13 కేజీల బరువు పెరిగిన రణ్బీర్
తాను నటించే పాత్రకు వందశాతం న్యాయం చేకూరుస్తారనే పేరు బాలీవుడ్లో రణ్బీర్ కపూర్ కు ఉంది. సంజయ్ దత్ మాదిరిగా కనిపించేందుకు ఈ చిత్రం కోసం రణ్బీర్ 13 కేజీల బరువు పెరిగాడు. ఇంతకు ముందుకంటే బాగా లావైన రణ్బీర్ ఇటీవల అవార్డుల కార్యక్రమంలో కనిపించి ఆశ్చర్యపరిచారు.

నర్గీస్ పాత్రలో మనీషా కోయిరాలా తప్ప...
నర్గీస్ పాత్రను ఒక్క మనీషా కోయిరాలా తప్పా మరెవరూ న్యాయం చేకూర్చలేరనే అభిప్రాయాన్ని రాజ్ కుమార్ హిరానీ వ్యక్తం చేశాడు. ఈ పాత్ర కోసం ఎంతో మంది తారలను పరిగణనలోకి తీసుకొన్నామని, అయితే ఎవరూ కూడా ఆ పాత్రకు న్యాయం చేయలేరనే భావన కలిగిందని ఆయన అన్నారు. ఎందుకంటే నర్గీస్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ మరణించారని, అదే మాదిరిగా మనీషా కూడా ఆ ప్రాణాంతక వ్యాధి బారిన పడి ఎదురించి ప్రాణాలతో బయటపడిందని పేర్కొన్నారు. అలాంటి పాత్రను మనీషా పోషిస్తేనే సహజత్వం కనిపిస్తుందని పేర్కొన్నారు.

క్యాన్సర్తో నర్గీస్ మృత్యువాత
సంజయ్ దత్ తల్లి నర్గీస్ పాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడి తన 51వ ఏట మృత్యువాత పడ్డారు. తన మరణానికి ముందు హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రతారగా, విలక్షణ నటిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్నారు. తమన్నా చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన ఆమె మదర్ ఇండియా, ఆగ్, అందాజ్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, చోరి చోరి చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











