మా అమ్మకు అక్కినేని సినిమాలంటే పిచ్చి: చిరంజీవి
హైదరాబాద్: తెలుగు సినిమా లెజెండ్, నటసామ్రాట అక్కినేని నాగేశ్వరరావు మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోక సముద్రంలో మునిగి పోయింది. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించిన ప్రముఖ నటుడు, కేంద్ర మంత్రి చిరంజీవి మాట్లాడుతూ....తెలుగు సినీ పరిశ్రమకు అక్కినేని చేసిన సేవలు మరువ లేనివి అన్నారు. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహానుభావుడు. అలాంటి గొప్ప వ్యక్తితో నాకు నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ సందర్భంగా చిరంజీవి... అక్కినేని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 'మా అమ్మకు అక్కినేని సినిమాలంటే పిచ్చి. నేను కడుపులో ఉన్నపుడు అమ్మ అక్కినేని సినిమా చూడటానికి వెలుతుండగా జట్కా బండికి చిన్న యాక్సిడెంట్ అయి అమ్మ కింద పడిపోయింది. కడుపులో ఉన్న నాకు ఏమైందో అని అని నాన్న కంగారు పడ్డారు. ఏమీ కాలేదని సర్దుకుని ఇంటికి వెళదామని నాన్న అంటే...సినిమా చూసే వెళదామని అమ్మ చెప్పిందట. అమ్మకు అక్కినేని సినిమా అంటే అంత పిచ్చి' అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

అక్కినేని ఎంతో ఆరోగ్యంగా ఉండే వారు. ఓసారి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ అక్కినేని ఆరోగ్య రహస్యం చెబితే ప్రజలందరూ అలా ఉండేలా చేద్దాం అని చెప్పారు....అక్కినేని అంత హుషారుగా ఉండేవారు. వారు మన మధ్య బౌతికంగా లేక పోయినా శాశ్వతంగా అందరి మనసులో నిలిచే ఉంటారు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
మంగళవారం అర్ధరాత్రి దాటాక అక్కినేని నాగేశ్వరరావు వూపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు 2.45 గంటల సమయంలో బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే వైద్యులు ఎమర్జెన్సీకి తరలించి ఆక్సిజన్ పెట్టారు. తరువాత పదినిమిషాలకే ఆసుపత్రికి వచ్చిన డా.సోమరాజు వైద్యుల బృందంతో కలసి పరిశీలించారు. అప్పటికే శ్వాస ఆగిపోవటంతో ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులకు తెలిపారు. ఆ సమయంలో కుమార్తె నాగసుశీల, మనవడు సుశాంత్ పక్కనే ఉన్నారు.


Click it and Unblock the Notifications











