టాలీవుడ్ కి టీ.సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్స్ విషయంలో, ఆక్యుపెన్సీ విషయంలో ఫుల్ క్లారిటీ !
ఒకపక్క ఎపిలో టికెట్ రేట్లు తగ్గించి, జగన్ సినీ జనానికి సింహ స్వప్నంగా మారితే తెలంగాణా ప్రభుత్వం మాత్రం అండగా నిలుస్తోంది. ఇప్పటికే తెలంగాణాలో టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఏపీకి మాకు సంబంధం లేదు
శుక్రవారం నాడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులతో తెలంగాణా సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. ఇండస్ట్రీ తరపున నిర్మాతలు దిల్రాజు, డీవీవీ దానయ్య, చినబాబు, యేర్నేని నవీన్, ప్రమోద్, అభిషేక్ నామా దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ వంటి వారు కలిసి సమస్యలను తెలియజేశారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ కరోనా థర్డ్వేవ్ అంటూ సాగే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, ప్రజలు ధైర్యంగా థియేటర్కు వచ్చి సినిమా చూడొచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరహాలో సినిమా టికెట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి ఆలోచన లేదని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి, తెలంగాణకు ఎటువంటి సంబంధం ఉండదని ఈ సంధర్భంగా మంత్రి తలసాని తేల్చి చెప్పారు.

ఎలాంటి ఆంక్షలు లేవు
కరోనా వల్ల రెండేళ్లుగా సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోందన్న ఆయన ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్ భయాలు మొదలయ్యాయని, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని అన్నారు. థియేటర్ ఆక్యుపెన్సీపై ఎలాంటి ఆంక్షలు లేవన్న ఆయన తెలంగాణ ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఇచ్చినా గత కొన్ని రోజులు ఆ స్థాయి ప్రేక్షకులు థియేటర్స్కు రావటం లేదన్నారు.

సంఖ్య కాస్త పెరిగింది
'అఖండ' విడుదలైన తర్వాత థియేటర్కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య కాస్త పెరిగిందన్న మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరహాలో సినిమా టికెట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన లేదని అన్నారు. 'ఆర్ఆర్ఆర్', 'పుష్ఫ', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలు ఎన్నో విడుదలకు సిద్దమవుతున్నాయి. కాబట్టి చిత్ర పరిశ్రమకు చెందిన డైరెక్టర్స్, నిర్మాతలతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు.

నిర్ణయం తీసుకుంటాం
కరోనాకి సంబంధించిన కొత్త వేరియంట్తో పాటు ఇండస్ట్రీలో ఉన్న ఇతర సమస్యలపై పరిశ్రమ తరపున ఒక మెమోరాండం ఇచ్చారని, సినిమా పరిశ్రమకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. సంక్రాంతి వరకు వరుసగా పెద్ద సినిమాలు వస్తున్నాయి కాబట్టి థియేటర్స్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పానని, ప్రజలకు కూడా మేము చెప్పేది ఒక్కటే. ఎలాంటి భయం వద్దు.. అన్ని జాగ్రత్తలతో ప్రజలంతా సినిమా థియేటర్లలోనే సినిమా చూడాలన్నారు. టికెట్ రేట్లపై కొన్ని సమస్యలు ఉన్నాయన్న ఆయన సీఎం కేసీఆర్గారితో చర్చించి.. సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారంపై ఓ నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు.
Recommended Video

డౌట్స్ వచ్చాయి అందుకే!
మంత్రి తలసానిని కలిసిన అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ''తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలపై మంత్రి తలసాని గారితో చర్చించామని. అనేక అంశాలు పరిష్కారం కావల్సి ఉందని అన్నారు. పెద్ద సినిమాలు అన్ని పూర్తి చేసుకుని విడుదల కోసం రెడీగా ఉండగా ఇంకో వేవ్ వస్తుందనే ప్రచారం జరుగుతోందని, అందుకే సినిమా ఇండస్ట్రీ వాళ్లకు ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి మంత్రితో సమావేశం అయ్యామని అన్నారు. మేము విన్నవించిన సమస్యలపై మంత్రి తలసాని స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్గారితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











