నాగార్జున అక్కినేనికి నోటీసులు.. అనుమతుల్లేకుండా అక్రమంగా అంటూ వార్నింగ్
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ నాగార్జున అక్కినేని వివాదంలో ఇరుక్కొన్నారు. అనుమతుల్లేకుండా తవ్వకాలు, అక్రమ నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలపై ఆయనకు గోవాలోని గ్రామ పంచాయితీ నోటీసులు జారీ చేసింది. దాంతో ఈ అంశం మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారంపై అక్కినేని నాగార్జున స్పందించాల్సి ఉంది. గోవాలో అక్రమ నిర్మాణం గురించిన వివాదంలోకి వెళితే..

అనుమతుల్లేకుండా కట్టడాలు
ప్రముఖ జాతీయ దినపత్రిక టీఓఐలో వచ్చిన వార్త ప్రకారం.. ఉత్తర గోవాలోని మాండ్రెమ్ గ్రామంలో నాగార్జున అక్కినేని నిర్మాణం చేపట్టారు. అయితే మండ్రెమ్ గ్రామ పంచాయితీ పరిధిలో చేపట్టిన తవ్వకాలు, నిర్మాణాలకు అనుమతి లేదని విషయాన్ని ఆ గ్రామ సర్పంచ్ అమిత్ సావంత్ మీడియాకు వివరించారు. గోవా పంచాయితీ చట్టం 1994 నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణలు, తవ్వకాలు చేపట్టారని గ్రామ పంచాయితీ అధికారులు మీడియాకు తెలిపారు.

అశ్వేవాడలో అక్రమ తవ్వకాలు..
నాగార్జున అక్కినేనికి మాండ్రెమ్ పంచాయితీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మండ్రెమ్ గ్రామ పంచాయితీ పరిధిలోని అశ్వేవాడలోని సర్వే నంబర్ 211/2 B భూమిలో అక్రమ తవ్వకాలు, నిర్మాణలు జరుగుతున్నాయి. గ్రామ పంచాయితీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా ఈ వ్యవహారాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఆయనకు నోటీసులు జారీ చేస్తున్నాం అని అధికారులు నోటీసుల్లో తెలిపారు.

పనులు నిలిపివేయలేకపోతే..
గోవాలోని మాండ్రేమ్ పంచాయితీ పరిధిలోని అక్రమ తవ్వకాలపై అధికారులు ఘాటుగా స్పందించారు. అక్రమ తవ్వకాలు, నిర్మాణాలు వెంటనే ఆపివేయాలి. ఒకవేళ పనులు నిలిపివేయలేకపోయతే.. గోవా పంచాయితీ రాజ్ యాక్ట్ 1994 కింద తగు చర్యలు తీసుకొంటాం అని పంచాయితీ అధికారులు నోటీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో వెంటనే స్పందించాల్సిందని వారు నోటీసుల్లో పేర్కొన్నారు.

ముందస్తు అనుమతులు లేకుండా
గోవా పంచాయితీ యాక్ట్ ప్రకారం.. ఏదైనా ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు, తవ్వకాలు చేపట్టినా ముందస్తు అనుమతులు తీసుకోవాలి. ఈ స్థల తవ్వకాలు, కట్టడాలకు సంబంధించిన ఆయన గానీ, ఆయన తరుఫున వ్యక్తులు గానీ అనుమతులు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఆ ప్రాంతంలో అనుమతుల్లేకుండా ఇంకా పనులు కొనసాగుతున్నాయి అని మాండ్రెమ్ గ్రామ పంచాయితీ అధికారులు తెలిపారు.

అక్కినేని నాగార్జున కెరీర్ ఇలా..
నాగార్జున అక్కినేని కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల బిగ్బాస్ తెలుగు సీజన్ 6 రియాలిటీ షోను ముగించారు. 2022లో వైల్డ్ డాగ్, బంగార్రాజు, ది ఘోస్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఘోస్ట్ సినిమా తర్వాత మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో నాగార్జున అక్కినేని ఉన్నారు. త్వరలోనే కొత్త సినిమా ప్రారంభానికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటిస్తారని మీడియా వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











