Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
రాజమౌళి పిలిస్తే అన్ని వదిలేసి పరుగెడతా : హీరో నాని
హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవా మూవీస్ పతాకాలపై పి.కిరణ్, గోళ్ళ గీత అందిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'మజ్ను'. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు ఎ సర్టిఫికెట్ పొందింది. సెప్టెంబర్ 23న వరల్డ్వైడ్గా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడటంతో నాని సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. సోమవారం విలేకరులతో సినిమా గురించి విషయాలతో పాటు ఇతర వివరాలు ముచ్చటించారు. ''అందరూ అనుకుంటున్నట్లు బాధలో ఉండే మజ్ను కథ ఈ సినిమా కాదు. ప్రేమలో పడి సమస్యల్లో ఉన్నట్లు కనపడే ఎవరినైనా మజ్ను అనే అంటాం. ఇక మా మజ్ను సినిమా విషయానికి వస్తే బోర్ కొట్టదు. అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇంటికి వెళ్ళినా గుర్తుకు వస్తుంటాడు అన్నారు.
ఉయ్యాలా జంపాలా కథను దర్శకడు విరించి వర్మ ముందు నాకే చెప్పాడు. కథ విన్నాక నిర్మాత రామ్మోహన్కి ఫోన్ చేసి 'కచ్చితంగా హిట్టవుతుంది' అని చెప్పా. 'అయితే నువ్వే చేసేయ్' అన్నారు. 'ఈ కథని కొత్తవాళ్లు చేస్తేనే బాగుంటుంది' అని చెప్పా. అంతా సిద్ధమయ్యాక ఆ సినిమాని మొట్టమొదట చూసింది కూడా నేనే.
తను చాలా మంచి నిజాయితీ ఉన్న వ్యక్తి. తన నిజాయితీ తన సినిమాలోని ప్రతి క్యారెక్టర్లో కనపడుతుంది. ప్రేక్షకులు అందుకే తన సినిమాను తమదిగా భావిస్తారు. అందుకే ఉయ్యాలా జంపాలా పెద్ద హిట్ సాధించింది. దాని కంటే మా మజ్ను ఇంకా పెద్ద హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.
కిరణ్గారు, గీతగారితో ఎప్పటి నుండో సినిమా చేయాలని
కిరణ్గారు, గీతగారితో ఎప్పటి నుండో సినిమా చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. నాకు అష్టాచమ్మా రోజులు గుర్తుకు తెచ్చిన సినిమా ఇది. యూనిట్ సభ్యులందరితో ఒక సభ్యుడిగా కలిసిపోయి ఈ సినిమా కోసం పనిచేశాను. హీరోయిన్స్ అనుఇమ్మాన్యుయల్, ప్రియాశ్రీలు చక్కగా యాక్ట్ చేశారు. గోపీ సుందర్తో భలే భలే మగాడివోయ్ తర్వాత చేస్తున్న మూవీ ఇది అన్నారు.
ప్రేమలేఖల కాలానికి తీసుకళుతుంది
‘‘ప్రేమలో విఫలమయ్యానని బాధపడకుండా, ఆ ప్రేమని ఎలా సాధించుకొన్నాడనే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా చూసినప్పట్నుంచి ‘మజ్ను' అనే మాటని మరో కోణంలో వాడతారు ప్రేక్షకులు. నిజమైన ప్రేమే కరవైన ఈ రోజుల్లో మళ్లీ ఓ స్వచ్ఛమైన, నిజాయతీతో కూడిన ఓ ప్రేమకథని తెరపై చూపిస్తున్నాం. ఇందులోని ప్రతీ సన్నివేశం ప్రతి ఒక్కరి గతాన్ని గుర్తు చేస్తుంది. ప్రేమలేఖల కాలానికి తీసుకెళుతుంది'' అని నాని చెప్పుకొచ్చారు.
తన పాత్ర గురించి నాని వివరిస్తూ...
ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఇందులో నేను ఆదిత్య అనే యువకుడిగా కనిపిస్తా. ‘బాహుబలి' సినిమాకి సహాయ దర్శకుడిగా ఎస్.ఎస్.రాజమౌళిగారి దగ్గర పనిచేస్తుంటా. ఈ సినిమాలో రాజమౌళిగారు ఒక్కరే కనిపిస్తారా? ‘బాహుబలి' బృందం కూడా కనిపిస్తుందా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. పూర్వాశ్రమంలో స్వతహాగా నేనూ ఓ సహాయ దర్శకుడినే కాబట్టి ఆ రోజులు గుర్తుకొచ్చాయి'' అని నాని తెలిపారు.
ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ...
‘‘తెలుగు సినిమా మారదా? అంటూ మనం ఇప్పుడు చేస్తున్న ఫిర్యాదులన్నీ మరి కొన్ని రోజుల్లో వినిపించవు. అంతా ఆశిస్తున్న ఆ మార్పు ఎంతో దూరంలో లేదు. ఇటీవల యువ దర్శకులు చెప్పిన కథల్ని విరివిగా వింటున్నప్పుడు నాకు కలిగిన అభిప్రాయమిది'' అంటూ విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు నాని సమాధానం ఇచ్చారు.
కథలు బాగా ఎంచుకొంటున్నానని అంటుంటారంతా
‘‘కథల విషయంలో ఈమధ్య కొత్తగా మారిందేమీ లేదు. ‘పైసా' సినిమాని ఎంతగా నచ్చి చేశానో, ‘జెంటిల్మన్'ని కూడా అంతే ఇష్టపడి చేశా. ఇది ఆడింది, అది ఆడలేదంతే. కథలు బాగా ఎంచుకొంటున్నానని అంటుంటారంతా. నిజానికి దాని వెనక పెద్ద రహస్యమేమీ లేదు. చేసిన కథని మళ్లీ చేయకూడదనుకొంటా. నాలోని ప్రేక్షకుడిని ఆకట్టుకొంటే చాలు. నేను వేరు, ప్రేక్షకుడు వేరు కాదు కదా! నాలోనూ ఓ ప్రేక్షకుడు ఉంటాడు కాబట్టి నాకు ఏ కథైతే నచ్చుతుందో అదే చేస్తుంటా అని నాని చెప్పుకొచ్చారు.
అలా పిక్స్ కాకుండా ఉండాలి
నాని సినిమా అంటే ఈ స్టైల్లో ఉంటాయి అని ఎవరూ ఫిక్స్ కాకుండా ఉండాలి. ఆ జాగ్రత్త తీసుకోవడం మరిచిపోకుండా సినిమాలు చేస్తున్నా... ఇకపై కూడా అలానే చేస్తుంటాను అని నాని స్పష్టం చేసారు. తన విజయ రహస్యం కూడా అదే అని నాని తెలిపారు.
రాజమౌళి పిలిస్తే అన్ని వదిలేసి పరుగెడతాను
ఈమధ్యే యువ దర్శకులతో ఎక్కువగా సినిమాలు చేస్తున్నా. కానీ మా వయసు హీరోల్లో పెద్ద దర్శకులతో ఎక్కువ సినిమాలు చేసినవాణ్ని నేనే అని చెబుతా. ఎస్.ఎస్.రాజమౌళి, కృష్ణవంశీ, గౌతమ్మేనన్, సముద్రఖని తదితరులతో సినిమాలు చేశా. అగ్ర దర్శకులు ఎవరైనా నా శైలికి తగ్గ కథ చెబితే తప్పకుండా చేస్తా. రాజమౌళి పిలిస్తే చేస్తున్న సినిమాలన్నీ వదిలేసి పరిగెడతా అంటూ ఓ ప్రశ్నకి సరదాగా కామెంట్ చేసారు నాని.
నెక్ట్స్ చేయబోయే ప్రాజెక్టులు
ఇటీవల కాలంలో చాలా కథలు విన్నాను. నాకూ బాగా నచ్చాయి. అన్ని చేయడానికి నాకు వీలు కాలేదు. వాళ్లు ఎవరితో ఆ కథలు చేసినా గొప్ప సినిమాలవుతాయి. అవన్నీ తెలుగు సినిమా మార్పునకు కారణమవుతాయి. ప్రస్తుతం ‘నేను లోకల్' అనే సినిమా చేస్తున్నా. ఆ తర్వాత డి.వి.వి.దానయ్య నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నా''.
నటీనటులు, తెర వెనక
నేచురల్ స్టార్ నాని, ఇమ్మానుయేల్, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్ మాదిరాజ్, కేవశదీప్, అనుపమ, మనీషా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్., సంగీతం: గోపీసుందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, దర్శకత్వం: విరించి వర్మ.