వాడు నా జీవితాన్నే మార్చేశాడు, ప్రతీ అరగంటకు గుర్తొస్తాడు: నాని
లైఫ్లో కొన్ని స్వీట్ మెమొరీస్ ఉంటాయి. ఆ జ్ఞాపకాలు గుండెను పదేపదే తడుముతుంటాయి. జీవితం ఒక మనిషికి ఇచ్చే అంతులేని అనుభూతి అది. ఆస్వాదిస్తే తప్ప.. మాటల్లో వర్ణించడమూ కష్టమే.
Recommended Video

ఇప్పుడు ఆ అనుభూతిని తానూ ఆస్వాదిస్తున్నానంటున్నారు నేచురల్ స్టార్ నాని. ఎంసీఏ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాని.. చిత్ర విశేషాలను, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.

ప్రతీ అరగంటకు గుర్తొస్తాడు..:
ఎంసీఏ చిత్ర విశేషాల గురించి చెబుతూ.. నాని తన వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావించారు. ఇటీవలే తండ్రి అయిన నాని తన పుత్రోత్సాహం గురించి చెప్పారు.
'మా అబ్బాయి పుట్టాక నా జీవితమే మారిపోయింది. వాడు రాకముందు వరకూ షూటింగ్ తర్వాత ఇంటికెళ్లాలి అన్న విషయం ఎప్పుడో కానీ గుర్తొచ్చేది కాదు. కానీ ఇప్పుడు ప్రతీ అరగంటకు ఓ సారి వాడి ముఖం నా కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది' అని నాని భావోద్వేగంతో చెప్పారు.

ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు:
నాగార్జునతో చేయనున్న మల్టీస్టారర్ సినిమా కోసం చర్చలు జరుగుతున్నట్లు నాని చెప్పారు. ఇప్పటికే కథ విన్నామని, ఇద్దరికీ నచ్చిందని అన్నారు. ప్రస్తుతం 'కృష్ణార్జున యుద్ధం' షూటింగ్ జరుగుతోందన్నారు. ఈ సినిమా వినూత్నంగాను, కమర్షియల్గానూ ఉంటుందన్నారు.

మణి సార్తో కుదరలేదు:
అవసరాల శ్రీనివాస్ ఓ సినిమా చేస్తున్నట్లు ఈ సందర్భంగా నాని తెలిపారు. మణిరత్నంతో సినిమా గురించి కూడా స్పందించారు. మణి సార్ తో సినిమా కోసం చర్చలు జరిగిన మాట వాస్తవమేనన్నారు.
అయితే ఆ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాలనుకోవడం.. ఎక్కువ మంది నటులు ఉండటంతో 'డేట్స్' సమస్య తలెత్తిందన్నారు. ఆ కారణంగానే మణి సార్తో సినిమా కుదరలేదన్నారు.

ఇలాంటి కథ ఉందా? అనేలా:
తానెప్పటికీ హారర్ చిత్రాల్లో నటించనని నాని స్పష్టం చేశారు. హారర్ సినిమాలు చూడటమంటే ఇష్టం కానీ నటించడం విషయంలో మాత్రం వాటికి దూరంగా ఉంటానన్నారు.
తాను నిర్మిస్తోన్న 'అ' సినిమా చాలా కొత్తగా ఉంటుందన్నారు. అసలు ఇలాంటి కథ కూడా ఒకటి ఉందా? అనిపించే స్థాయిలో ఆ సినిమా ఉంటుందన్నారు.
'అ' అనేది ఆశ్చర్యానికి గుర్తు అని, ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటుందని, అందుకే ఆ టైటిల్ పెట్టామని చెప్పుకొచ్చారు.

ఎంసీఏ విశేషాలు:
ఎం.సి.ఎ ట్రైలర్లో ఏ కథైతే కనిపిస్తుందో అదే ఈ సినిమా అన్నారు నాని. ప్రతీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేదని, కానీ ఎంసీఏ మాత్రం ఎక్కువమందికి నచ్చే చిత్రంగా నిలుస్తుందని అన్నారు.
సినిమాల్లోని పాత్రలు వాస్తవ జీవితాన్ని చూసుకున్నట్లే ఉంటాయన్నారు. సహజంగా ఉండాలని సినిమాను వరంగల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. జనాల మధ్య కొంత ఇబ్బంది ఎదురైనా.. సినిమా మాత్రం నేచురల్ గానే వచ్చిందన్నారు.

వేణు శ్రీరామ్.., నాకవి అనవసరం:
గతంలో 'ఓ మై ఫ్రెండ్' ఫ్లాప్ తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ నుంచి సినిమా రాలేదు. ఇప్పుడు నానితో వేణు శ్రీరామ్ ఎంసీఏ తెరకెక్కించడంతో.. వేణుకు ఎలా ఛాన్స్ ఇచ్చారబ్బా? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
అయితే నాని మాత్రం ఫుల్ క్లారిటీతోనే ఉన్నారు. మన సినిమా విజయం సాధించిందని, తర్వాతి సినిమాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కావాలంటే కొత్త దర్శకులు రారు అని గుర్తుచేశారు. అలా అయితే కొత్త కథలు తెరకెక్కే అవకాశమే ఉండదన్నారు.
శ్రీరామ్ ఎన్ని సినిమాలు చేశాడు, ఎంత గ్యాప్ వచ్చింది వంటి విషయాలు తనకు అక్కర్లేదని అన్నారు. కథ ఎంత బాగా చెప్పాడు.. ఎలా తెరకెక్కించాడనేదే ముఖ్యం అన్నారు.

నిజంగా వదినే:
భూమిక మంచితనం గురించి ఇదివరకు విన్నానని, కానీ ఎంసీఏ చిత్రీకరణ సందర్భంగా స్వయంగా చూశానని నాని అన్నారు. సెట్కు వెళ్లిన తొలి రోజు ఆమెతో మాట్లాడిన తొలి మాటను గుర్తుచేసుకున్నారు.
'మేడమ్ మీ 'ఖుషి' సినిమా చూడ్డానికి వెళ్లినప్పుడు టిక్కెట్ల కోసం ఎక్స్ట్రా లైన్లో నిలబడ్డప్పుడు పోలీసులు కొట్టారు. ఇప్పుడు మీతో కలిసి నటిస్తున్నాను' అని భూమికతో చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి భూమిక నిజంగానే తనకు వదిన అయిందన్నారు.


Click it and Unblock the Notifications











