భయపడ్డా... వణుకు వచ్చి చెమటలు పట్టింది: ఎన్టీఆర్
హైదరాబాద్: నటన, కేశాలంకరణ, దుస్తులు, సంభాషణలు, నృత్యాలు ఇలా ప్రతి విషయంలోనూ దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ సినిమాలో జస్టిస్ చౌదరి గెటప్ వేయాలన్నప్పుడు నాకు చెమటలుపట్టాయి. వణుకు వచ్చింది. 'అన్నా ఇది రిస్క్ అవుతుందేమో' అన్నా. 'బాగుంటుంది' అని దర్శకుడు నాతో బలవంతంగా చేయించారు అంటూ ఎన్టీఆర్ 'బాద్షా' అనుభూతులు వివరించారు.
అలాగే ఆ పాత్రకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు కూడా భయపడ్డాను. నా జీవితాంతం మర్చిపోలేని సన్నివేశం అది. ఇప్పుడు సన్నగా ఉన్నాను కాబట్టి.. బాగుంటుందా అని తటపటాయించాను. కానీ ధైర్యం చెప్పి ఆ గెటప్ వేయించారు శ్రీను. ఆయన ఆ ధైర్యం ఇవ్వకపోతే ఆ మహనీయుడు వేసుకున్న గెటప్ను ధరించే అదృష్టం నాకు కలిగేది కాదు అన్నారు.
ఇక శ్రీను వైట్లను చూస్తుంటే నాకు జంధ్యాలగారు గుర్తొస్తారు. ఆయనంటే నాకు ప్రాణం. జంధ్యాలగారి ఫొటోను ఇంట్లో పెట్టుకున్నాను. నవ్వించడం ఒక యోగం అన్నారాయన. అదే రూట్లో వెళుతున్నారు శ్రీను. 'దమ్ము' తర్వాత నాలుగు నెలలు ఖాళీగా ఉన్నాను. ఆ నాలుగు నెలల్లో నాలుగు కథలు వినిపించారు శ్రీను వైట్ల. ప్రతి కథ బాగానే ఉందన్నాను. కానీ ఆయన మాత్రం ఓకే చేయలేదు. అయిదో కథగా 'బాద్షా' వినిపించారు. ఆ నాలుగు కథల్లో ఉన్నటువంటి ఆసక్తిరమైన అంశాలను కలిపి 'బాద్షా' తయారు చేశారు. ఈరోజు ఈ విజయానికి కారణం అదే అన్నారు.
అంతేకాదు.. నా నుంచి ఏమీ ఆశించకుండా స్నేహితుడి పాత్ర వేశాడు సిద్ధార్థ్. తనకి నా కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం నిర్మాత కూడా చాలా కష్టపడ్డాడు. ఎప్పుడు పలకరించినా.. 'బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వాలన్నా..' అనేవాడు. తథాస్తు దేవతలు అతని మాట విన్నారేమో'' అని చెప్పారు. ఓవర్సీస్లో 'దూకుడు' తర్వాత అంత కలెక్ట్ చేస్తుందీ సినిమా. ఈ వసూళ్లు చూస్తుంటే నాకు ఓవర్సీస్లో ఇంత స్టామినా ఉందా అనిపించింది'' అన్నారు.


Click it and Unblock the Notifications












