Padma Awards 2022: ఎవరీ దర్శనం మొగిలయ్య.. 12 మెట్ల కిన్నెర వాయిద్యం విశిష్టత ఏమిటంటే?
జానపద కళాకారుడు, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య మరోసారి జాతీయ వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. మరుగున పడిపోతున్న, అంతరించి పోతున్న కిన్నెర వాయిద్యం కళకు అండగా నిలిచిన కళాకారుడిగా మొగిలయ్య గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడటం ద్వారా ప్రపంచ సంగీత రంగానికి పరిచయం అయ్యారు. మొగిలయ్య సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. దర్శనం మొగిలయ్య అలియాస్ 12 మెట్ల కిన్నెర వాయిద్య కారుడి గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

వంశపారంపర్యంగా కిన్నెర వాయిద్యం
దక్షిణ తెలంగాణలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో మారుమూల ప్రాంతానికి చెందిన దర్శనం మొగిలయ్య పేదరికంతో బాధపడుతున్నారు. తన వంశపారంపర్యంగా వచ్చిన కిన్నెర వాయిద్యాన్ని స్వయంగా చేసుకొని పొట్టకూటి కోసం పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాటలు పాడుతూ బతుకు జీవనం కొనసాగిస్తూ వచ్చారు. అయితే భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడిన తర్వాత ఆయన దశ, దిశ తిరిగిపోయింది.

మియా సాహెబ్ పాటతో పవన్ కల్యాణ్తో అనుబంధం
మహబూబ్ నగర్ జిల్లాలోని పేదలకు సహాయం చేసిన వీరులకు, ఆ ప్రాంతంలోని మరుగున పడి వెలుగులోకి రాని వీరుల జీవితాలను ప్రతిబించేలా పాటలు పాడుతుండే వారు. పాలమూరులోని పేదల కోసం పోరాటం చేసిన మియా సాహెబ్ అనే వీరుడిపై రాసిన పాట సంగీత, సాహిత్య ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ పాటనే మార్చి భీమ్లా నాయక్ చిత్రంలో ఆడాలేడు మియా సాబ్ ఈడాలేడు మియా సాబ్ అనే పాటగా మార్చారు. దాంతో ఒక్కసారిగా 12 మెట్ల కిన్నెర మొగిలయ్య పేరు మార్మోగింది.

మామిడి హరికృష్ణ ప్రోత్సాహంతో
సినీ, సాహిత్య, జానపద రంగానికి కిన్నెర మొగిలయ్యను పరిచయం చేసిన ఘనత, ఆయనను ఆదుకొన్న ఘనత తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణకే దక్కుతుంది. కటిక పేదరికంతో బాధపడుతున్న ఆయనకు ప్రభుత్వ పింఛన్ అందించే ఏర్పాటు చేశారు. మామిడి హరికృష్ణ సూచన మేరకే భీమ్లానాయక్ సినిమాలో పాడే పాడే అవకాశం లభించింది. పవన్ కల్యాణ్ సినిమాలో పాట పాడిన తర్వాత మొగిలయ్య జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆయన ఎక్కడ కనిపించినా సెల్పీ తీసుకొంటూ ఆయన ప్రతిభను కొనియాడటం తెలిసిందే.

పవన్ కల్యాణ్ ఆర్థిక సహాయం
దర్శనం మొగిలయ్య పాడిన పాటకు భీమ్లా నాయక్ చిత్ర నిర్మాతలు భారీ పారితీషికాన్ని అందించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ కూడా స్వయంగా ఆర్థిక సహాయం అందించారు. దాంతో మొగిలయ్య పేదరికం నుంచి కాస్త ఉపశమనం పొందారు. పవన్ కల్యాణ్ను కలిసిన తర్వాత నా జీవితం మారిపోయిందనే విషయాన్ని స్వయంగా మొగిలయ్య చెప్పడం తెలిసిందే.

8వ తరగతిలో పాఠ్యాంశంగా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 12 మెట్ల కిన్నెర వాయిద్య కారుడిగా దర్శనం మొగిలయ్యకు అరుదైన గౌరవం దక్కింది. మొగిలయ్య కష్టాలు, ప్రతిభను తెలుసుకొన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సన్మానం చేశారు. పాఠశాల విద్యలో భాగంగా ఎనిమిదో తరగతిలో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చారు. ఆయన జీవితాన్ని స్పూర్తిగా మలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాంస్కృతిక శాఖ కృషి చేస్తున్నది.

నమ్ముకొన్న కళకే జీవితాన్ని ధారపోస్తూ..
పేదరికం కారణంగా కూలీ పనులు చేస్తూ.. కన్న బిడ్డలను పొగొట్టుకొన్న దర్శనం మొగిలయ్య జీవితం అత్యంత విషాదకరం. ఎన్నో విషాదాలను, సమస్యలను ఎదిరిస్తూ.. ఏ దశలోను మనోధైర్యం కోల్పోకుండా తాను నమ్ముకున్న కళకు జీవితాన్ని అంకింతం చేశారు. ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయన ఇంకా ఎన్నో మైలురాళ్లను అధిగమించాలని తెలుగు ఫిల్మీబీట్ ఆకాంక్షను వెల్లడిస్తున్నది.


Click it and Unblock the Notifications











