చిరంజీవి, దాసరిపై కృష్ణ మాదిగ కామెంట్స్... పలాస 1978 చూసి భావోద్వేగం.. కంటతడి
ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన పలాస 1978 చిత్రం మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, విజయ్ రామ్, తిరువీర్, లక్ష్మణ్ మీసాల, ప్రవీణ్ ఎండమూరి, జగదీష్ ప్రతాప్ బండారి, మిర్చి మాధవి, షణ్ముఖ్ తదితరుల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సానుకూలం స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఈ చిత్రాన్ని వీక్షించి తన స్పందనను వ్యక్తం చేశారు. కృష్ణ మాదిగ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
Recommended Video


దళిత జీవితాలకు నిలువుటెద్దు అద్దం
పలాస 1978 చిత్రాన్ని ప్రతీ దళితుడు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మీద అభిమానం ఉన్న ప్రతీ ఒక్కరు చూడాల్సిన చిత్రం. తరతరాలుగా మా జీవితాలపై సాగిన అన్యాయాలకు అద్దం పట్టిన చిత్రం. దళిత జీవితాల్లో మార్పుకు కేంద్ర బిందువుగా, సమాజాన్ని చైతన్య పరిచే చిత్రం. ఊరికి దూరంగా వెలివేయబడ్డ మా జీవితాలు, ఎలా ఛిద్రమై పోతయో.. ఉన్నత వర్గాల రాజకీయాలకు ఎలా బలైపోతయో.. మా అస్థిత్వాన్ని పరీరక్షించుకోవాలనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రం పలాస 1978 అని మంద కృష్ణ మాదిగ అన్నారు.

మళ్లీ మళ్లీ చూడాలనే విధంగా
దళితులు గానీ, అంబేద్కర్పై గౌరవం ఉన్న దళితేతరులు చూడాల్సిన చిత్రం. ఒక్కసారి చూస్తే చాలదు.. పదిసార్లు చూసినా మళ్లీ చూడాలనే కోరిక కలిగే విధంగా దర్శకుడు కరుణ కుమార్ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతకు, దర్శకుడికి, సినిమాలో ప్రతీ పాత్రకు జీవం పోసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని కృష్ణ మాదిగ తెలిపారు.

చిరంజీవి స్వయంకృషిలో
మా జీవితాలపై సినిమాలు రావని, ఎవరెవరో వారి దృక్ఫథాలకు అనుగుణంగా రూపొందించే సినిమాలు చూడాలని వస్తుందనే భావనలో ఉన్నాం. అలాంటి చిత్రాలే చూస్తూ వచ్చాం. మా జీవితాలకు నిలువుటెద్దు అద్ధంపట్టే చిత్రాలు చాలా తక్కువ. మా సోదరులు చిరంజీవి స్వయంకృషి చిత్రంలో చెప్పులు కుట్టే వాడి పాత్రలో నటించారు. చెప్పులు కుట్టే వ్యక్తైనా ఉన్నత శిఖరాలకు ఎదుగొచ్చనే విధంగా స్ఫూర్తిని కలిగించే చిత్రంలో నటించారు అని కృష్ణ మాదిగ పేర్కొన్నారు.

దాసరి చిత్రాల్లో సామాజిక అంశాలు
స్వర్గీయ దాసరి నారాయణరావు అంటే నాకు ఎంతో అభిమానం, గౌరవం. ఆయన తీసిన ఎన్నో చిత్రాల సామాజిక అంశాలను సృశించేలా ఉన్నాయి. వివక్ష, అణిచివేత ఎదురించడం, సమాజంలో మార్పుకు, అణిచివేతను ప్రతిఘటించడం ఆయన రూపొందించిన చిత్రాల్లో ఉండేవి. అలాంటి గొప్ప చిత్రాలు ఈ మధ్యకాలంలో వచ్చిన దాఖలాలు లేవు. మా జీవితాలకు వాస్తవ రూపం చూపించిన చిత్రం పలాస 1978. ఈ చిత్రంలో పాత్రల ద్వారా మాట్లాడించిన తీరుతో నా కళ్లు చెమర్చాయి. ఇలాంటి సినిమాలను ప్రోత్సాహించాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని కృస్ణ మాదిగ భావోద్వేగానికి గురయ్యారు.

ఉత్తరాంధ్ర సంఘటనలు కళ్లకు కట్టినట్టుగా
ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో భాగంగా ఉత్తరాంధ్రలోని పలాస, కాశిబుగ్గ పట్టణాలకు ఎన్నోసార్లు వెళ్లాను. ఆ ప్రాంతంలో 1978 సంవత్సరంలో చోటుచేసుకొన్న పరిస్థితులను పలాస 1978 చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దక్షిణాదితోపాటు తెలుగువారు ఉంటే ప్రతీ చోట ఈ సినిమాను ప్రదర్శిస్తే మంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాను అని కృష్ణ మాదిగా అభిప్రాయపడ్డారు.

తమ్మారెడ్డి, చిత్ర యూనిట్పై ప్రశంసల వర్షం
పలాస 1978 చిత్రాన్ని ప్రేక్షకుల వద్దకు తీసుకురావడానికి, అద్భుతమైన సినిమాను రూపొందించిన తమ్మారెడ్డి భరద్వాజను ప్రత్యేకంగా అభినందించాలి. దాసరి తర్వాత నాకు అత్యంత గౌరవం ఉన్న వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన ప్రతీ ఒక్కరిని అభినందించేందుకు ఓ కార్యక్రమాన్ని చేపడుతాం. ఈ సినిమాకూ పూర్తిస్థాయి మద్దతును అందిస్తాం అని మందకృష్ణ తెలిపారు.


Click it and Unblock the Notifications











