Padma Awards 2022 దేశ ప్రతిష్టతను ఉన్నత శిఖరాలకు.. తెలుగు పద్మ పురస్కార గ్రహీతలపై పవన్ కల్యాణ్ ప్రశంసల జల్లు..
దేశంలోని వివిధ రంగాలకు విశేష కృషిని అందించిన ప్రముఖులకు, సాహితి, వ్యాపార, రాజకీయ, సాంకేతిక రంగాలకు చెందిన వ్యక్తుల సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి పద్మ అవార్డులను, ప్రకటించింది. 2022లో 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్ అవార్డులు, 107 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. ఈ సందర్భంగా పద్మ శ్రీ అవార్డు గ్రహీతలను అభినందిస్తూ.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో పవన్ కల్యాణ్ ప్రశంసలు అందజేస్తూ..

కోవిడ్ మహమ్మారిని తుద ముట్టించేందుకు
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారగ్రహీతల్లో స్థానం పొందిన తెలుగువారికి నా తరఫున జనసేన పార్టీ పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. కోవిడ్ మహమ్మారిని అదుపు చేసేందుకు విస్తృత ప్రయోగాలు చేసి వ్యాక్సిన్ ఆవిష్కరించి ప్రపంచానికి అందించి... మన దేశ పరిజ్ఞాన విశిష్టతను చాటిన భారత్ బయోటెక్ సంస్థ కృషికిగాను ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ ఎల్లా, శ్రీమతి సుచిత్ర ఎల్లాలకు పద్మభూషణ్ పురస్కారం దక్కడం ముదావహం అని తన ప్రకటనలో పవన్ కల్యాణ్ తెలిపారు.

దేశ రక్షణ కోసం అంటూ పవన్ ఎమోషనల్
సాఫ్ట్ వేర్ రంగంలో తెలుగువారి ఖ్యాతి చాటిన మైక్రోసాఫ్ట్ సీఈవో శ్రీ సత్య నాదెళ్ళతోపాటు గూగుల్ సీఈవో, మన దక్షిణ భారతీయుడు శ్రీ సుందర్ పిచాయ్, కోవిడ్ వ్యాక్సిన్ అందించిన సీరం సంస్థ ఛైర్మన్ శ్రీ సైరస్ పూనావాలా పద్మభూషణ్ అవార్డుకు ఎంపికచేయడం సముచితం. దేశ రక్షణ కోసం విశిష్ట సేవలందించి ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ శ్రీ బిపిన్ రావత్ కు పద్మవిభూషణ్ ప్రకటించి ఆయన సేవలకు సార్థకత కలిగించారు అని పవన్ కల్యాణ్ ప్రశంసించారు.

గరికపాటి, డాక్టర్ సుంకరకు అభినందనలు
తెలుగు సాహిత్యం, ఆధ్యాత్మిక అంశాలపై సాధికారత కలిగిన ప్రవచనకర్త, అవధాని శ్రీ గరికపాటి నరసింహారావు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు, పోలియో నిర్మూలన మిషన్ లో కీలకంగా వ్యవహరిస్తూ పేదలకు వైద్యం అందించే డా.సుంకర ఆదినారాయణరావు, అరుదైన కిన్నెర వాయిద్యంపై సంగీతం పలికించే శ్రీ దర్శనం మొగులయ్య, ప్రముఖ కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి పద్మజా రెడ్డి, కళాకారులు శ్రీ రామచంద్రయ్య, ప్రముఖ నటి శ్రీమతి షావుకారు జానకి గార్లను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది అని తన ప్రకటనలో పేర్కొన్నారు.

గోసవీడు షేక్ హసన్కు మోడీ ప్రభుత్వం గుర్తింపు
భద్రాచలం దేవాలయం ఆస్థాన విద్వాంసులుగా సేవలందించిన నాదస్వర కళాకారులు దివంగత గోసవీడు షేక్ హసన్ గారిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం ద్వారా ప్రచారానికి దూరంగా కళా సేవ చేసేవారిని, సంఘ సేవకులను శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గుర్తిస్తుంది అని మరోసారి వెల్లడైంది అని పవన్ కల్యాణ్ అన్నారు.

మణుగురు కళాకారుడికి పద్మశ్రీతో గుర్తింపు
ఇదిలా ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన జానపద గాయకుడు, కళాకారుడు రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డు కు ఎంపిక అయ్యారు.దీనితో భద్రాద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ అభినందనలు తెలియజేశారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు దేశ వ్యాప్తంగా 107 మందిని ఎంపిక చేసిన జాబితాను ప్రకటించారని అట్టి జాబితాలో రామ చంద్రయ్య (క్రమ సంఖ్య 96) ఎంపిక జరిగినది. మారు మూల ప్రాంతం నుండి ప్రతిష్టాత్మక పురస్కారానికి గిరిజన వ్యక్తి ఎంపిక కావడం విశేషం. దీంతో భద్రాద్రి జిల్లాకు దేశ స్థాయిలో లభించిన గొప్ప గౌరవమని చెప్పవచ్చు అని కలెక్టర్ తెలిపారు.


Click it and Unblock the Notifications











