పవన్ కళ్యాణ్ బాలల చలనచిత్రోత్సవం (ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : హైదరాబాద్లో గత వారం రోజులుగా జరిగిన 18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ ముగింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సినీనటుడు పవన్కల్యాణ్ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. బాలదర్శకులు, లైవ్యాక్షన్ విభాగాల విజేతలకు గవర్నర్ నరసింహన్ జ్ఞాపికల్ని, ధ్రువపత్రాలను అందజేశారు. లఘుచిత్రాల్లో విజేతలకు రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి డి.కె.అరుణ జ్ఞాపికలు అందజేశారు. యానిమేషన్ విభాగ విజేతలకు పవన్కల్యాణ్ జ్ఞాపికల్ని అందజేశారు.
పవన్కల్యాణ్ మాట్లాడుతూ ''మూడు రోజుల క్రితం ఎఫ్డీసీ ఛైర్మన్ దానకిషోర్ నన్ను ఈ ముగింపు కార్యక్రమానికి ఆహ్వానించారు. పిల్లల కోసమే నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. పిల్లల మీద ప్రేమే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చింది. ఇంతటి ప్రఖ్యాత బాలల చిత్రోత్సవానికి హైదరాబాద్ వేదిక కావడం ఆనందంగా ఉంది. పిల్లలకే కాదు అందరికీ ఆనందాన్నిచ్చిన ఈ కార్యక్రమంలో నేను ఓ భాగమైనందుకు సంతోషంగా ఉంది'' అన్నారు.
''అంతర్జాతీయ బాలల చిత్రోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి పిల్లలు వచ్చి సినిమాలు చూశారు. వారి ఆనందం చూస్తే నాకు ఎంతో సంతోషమేసింది. అయితే అది నా మనసు నిండేంత కాదు. ఇంకా మరింత మంది పిల్లలు సినిమాలు చూడాలి. ఈ ఉత్సవం మొత్తం పిల్లలందరికీ చేరాలి. అప్పుడే నాకు ఆనందం'' అన్నారు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్.
వివిధ దేశాల సంప్రదాయ కళలన్నీ ఒకే వేదికపై నగరవాసులకు కనువిందు చేశాయి. చిన్నారుల ఆటా.. పాట.. మాటలతో తెలుగు లలితకళాతోరణం పులకించి పోయింది. 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ముగింపు వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. సాంస్కృతిక సందడిలో బాలనటి అని వ్యాఖ్యానం రసరమ్యంగా సాగింది. గవర్నర్ నరసింహన్ దంపతుల రాక సందర్భంగా నరసింహన్ అంకుల్కు స్వాగతం అని సంబోధించింది. హీరో పవన్కల్యాణ్ సభాస్థలికి చేరుకోగానే ప్రేక్షకులంతా కేరింతలు పెడుతూ అభిమానాన్ని చాటుకున్నారు.
పవన్ కళ్యాణ్...ఫోటోలు స్లైడ్ షోలో ..

ఘనంగా...
18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ ముగింపు వేడుకలు బుధవారం సాయంత్రం నగరంలోని లలిత కళాతోరణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా టాలీవుడ్ హీరో పవన్ కల్యాన్, పలువురు సినీ ప్రముఖులు, రాష్ట్రమంత్రులు తదితరులు హాజరయ్యారు.

బంగారు ఏనుగు...
ఉత్తమ బాల దర్శకులుగా సిద్ధాంత్ జోషి, పవన్సింగ్ లు ఎన్నిక అయ్యారు. 'బ్రేకింగ్ సైలెంట్', 'టమాటా చోర్' చిత్రాలకు గాను వీరు బంగారు ఏనుగును అందుకున్నారు. ఈనెల 14 అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అందుకు హైదరాబాద్ వేదిక అయింది.

మళ్లీ రెండేళ్లు ..
ఒసామా, హారిజన్ బ్యూటిఫుల్, మిణుగురులు, తైనా, గోపీ అండ్ బాగా లాంటి చిత్రాల ప్రదర్శనకు తెరపడింది. బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఐమ్యాక్స్లో 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం చిన్నారుల కేరింతల మధ్య ముగిసింది. చివరి రోజు చిత్రాల వీక్షణకు ఐమ్యాక్స్లో బాలలు కిక్కిరిసిపోయారు. ఈ వేడుకలు మళ్లీ రావాలంటే మరో రెండేళ్లు పడుతుందంటూ.. ఇప్పుడే సంతోషాల్ని సొంతం చేసుకుందామని విద్యార్థులు ప్రముఖ చిత్రాల్ని తిలకించడానికి పోటీపడ్డారు.

ధీమా...
సినిమా తీయాలంటే భారీ సెట్టింగులు ఉండాలి. పెద్ద హీరోలు, రూ.కోట్లాది బడ్జెట్, దర్శకుడు నోట్లో పెద్ద చుట్ట పెట్టుకుని.. పెరిగిన గెడ్డం, శిరోజాలతో కనిపించాలి. ఇవే ఇప్పటి వరకు కనిపించిన ప్రాధమ్యాలు. కానీ.. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం మాత్రం అవన్నీ అవసరం లేదని తేల్చి చెప్పింది. చిన్నారులు, వారి తల్లిదండ్రులు, సినిమా ప్రేమికులు అంతా తామూ సినిమా రూపొందించగలం అనే స్ఫూర్తిని పొందారు. వచ్చే రెండేళ్లలో తాము కూడా ఒకచిత్రం తీసి దాన్ని ప్రదర్శించగలం అనే ధీమా వ్యక్తం చేయగలిగారు.

సూర్తి...
మిణుగురులు చిత్రం పలువురిలో స్ఫూర్తి రగిలించింది. ఇందులో నిజజీవితంలో అంథ విద్యార్ధులు ఎదుర్కొనే సమస్యల్ని కళ్లకు కట్టారు. ఆ చిత్రంతోపాటు చాలా సినిమాలు భారీ సెట్టింగులు హడావుడి లేకుండానే నిర్మించినవి కావడం గమనార్హం. దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడికి వచ్చిన బుల్లి దర్శకులు, నటులు ఎన్నో విషయాల్ని ఆకళింపు చేసుకున్నారు. ఇరాన్ లాంటి దేశాలు ఎలాంటి వనరులు లేకున్నా పలు ఆసక్తికరమైన చిత్రాల్ని నిర్మించిన తీరు వారికి కొత్త శక్తిని ఇచ్చింది.

దర్శకులకు దడ పుట్టించారు
అదేంటీ మీరు నిర్మించిన చిత్రంలో ముగింపు సరిగ్గా లేదు? బాల్కనీలో గుర్రం ఎలా ఉంటుంది? అంతా కల్పిత కథను సృష్టించారు. జనాన్ని తరిమే ఆ గుర్రాన్ని ఆ చిన్నారి ఒక్కడే లొంగదీసుకోవడం ఎలా సాధ్యం? మీరు నిర్మించిన ఆ చిత్రంలో అతను అదే పనిగా ఎందుకు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు? ఈ చిత్రం మీరు ఎందుకు తీశారు? ఎంత ఖర్చు అయింది? దీని ద్వారా మీరు ఏం నీతి చెబుతున్నారు? ఒకటా రెండా.. వందలాది ప్రశ్నలతో చిన్నారులు దర్శకుల్ని ఉక్కిరిబిక్కిరి చేశారు.

సినిమాలతో పాటే...
అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం కేవలం చిత్రాల్ని మాత్రమే తీసుకురాలేదు. యానిమేషన్లో కార్యశాల, ఓపెన్ ఫోరం, ఆయా చిత్రాల దర్శకులు, నిర్మాతలతో నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమాలు, ప్రకృతి మిత్ర, బయో స్కోపు పేరుతో వెలువరించిన ప్రత్యేక బులిటెన్లు పలువురు చిన్నారులకు సరికొత్త విజ్ఞానాన్ని అందించాయి. నిత్యం బడికి, చదువులకే పరిమితమైన చిన్నారులు వారం పాటు అంతర్జాతీయ స్థాయిలో విజ్ఞానం సొంతం చేసుకోగలిగారు.

ఇచ్చిపుచ్చుకున్నారు
విదేశీ బాలలు, ప్రతినిధులు భారతీయ విద్యార్థులతో కలిసిపోయారు. సంప్రదాయాల్ని తెలుసుకునేందుకు యత్నించారు.మన విద్యార్థులు వారి దేశ పరిస్థితుల్ని, సాంకేతికాంశాల్ని తెలుసుకున్నారు.

చిత్రోత్సవాలు..
'నేను ఇప్పటి వరకు తొమ్మిది చిత్రోత్సవాల్లో పాల్గొన్నాను. అందరూ బాలల చిత్రాలు ఎక్కువ సంఖ్యలో రావాలని కోరుకుంటారు. కానీ ఎవరైనా వాటిని నిర్మిస్తే మాత్రం ప్రేక్షకుల నుంచి స్పందన తక్కువగా ఉంటుంది. మరిన్ని చిత్రాలు రావాలంటే మాత్రం బాలల చిత్రాల్ని ఆదరించే వారు తప్పకుండా పెరగాలి. ఇక్కడ విద్యార్థుల భాగస్వామ్యం కూడా పెరగాల్సి ఉంది.' అని సినీ నటుడు అశోక్ కుమార్ అన్నారు.

ఒకేచోట నిర్వహిస్తే బాగు - కుష్, జ్యూరీ సభ్యుడు
ఈ చిత్రోత్సవాల్లో కార్యశాలలు, చర్చా కార్యక్రమాలు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించారు. ఇలా కాకుండా వీటన్నింటిని ఒకే చోట ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వచ్చే వేడుకల్లో అయినా ఈ విధానాన్ని అవలంబిస్తే ప్రయోజనం ఉంటుంది

సర్కారు ప్రోత్సాహం కీలకం.. - వెన్ థార్న్లీ, జాంబేజియా చిత్ర దర్శకుడు
బాలల చిత్రాల్ని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఉత్సవాలు జరుగుతున్నాయి. కానీ ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు మాత్రం బాలల చిత్రాలు నిర్మించేవారికి సరైన ప్రోత్సాహం అందించడం లేదు. ఇది దురదృష్టకరం. మాలాంటి కొంత మంది నష్టాలు వచ్చినప్పటికీ పిల్లల చిత్రాలు తీయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. వీరిని ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించాలి.

ప్రణాళికలు వేయాలి- అనన్య సేన్, బాల దర్శకురాలు
నేను 'గివ్ మీ ఏ ఛాన్స్' చిత్రానికి దర్శకత్వం వహించాను. ఇక్కడ ప్రదర్శించిన చాలా చిత్రాల్ని చూశాను. బాలనటులను, దర్శకులను ప్రోత్సహించేందుకు పాఠశాల స్థాయినుంచే ప్రణాళిక రూపొందించాలి. ఈ చిత్రోత్సవాల ఏర్పాట్లు నచ్చాయి.

చిన్నారుల మనసుపై చెరగని ముద్ర- రమేష్ ప్రసాద్, ఐమ్యాక్స్ థియేటర్ అధినేత
చిన్నారుల మనసులపై సినిమాలు చెరగని ముద్రవేస్తాయని ఐమ్యాక్స్ అధినేత రమేష్ ప్రసాద్ పేర్కొన్నారు. సినిమా రంగంలోని వారికోసం జ్యూరీ సభ్యుడు గోపాలకృష్ణ రూపొందించిన ప్రత్యేక బ్యాడ్జీ, బ్రోచర్ను ఆయన విడుదల చేశారు. ఇరాన్లో మాదిరిగా మన వద్దా పిల్లల కోసం నిర్మించిన చిత్రాలు ఎక్కువ సంఖ్యలో రావాలన్నారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ సభ్యులు సునీల్ రెడ్డి, నటుడు అశోక్ కుమార్ పాల్గొన్నారు.

లైవ్ యాక్షన్
ఉత్తమ చిత్రం - కౌబాయ్ (నెదర్లాండ్స్); ఉత్తమ చిత్రం (చిల్డ్రన్ జ్యూరీ),
ఉత్తమ ద్వితీయ చిత్రం- ది హార్స్ ఆన్ ది బాల్కనీ (ఆస్ట్రియా);
ఉత్తమ దర్శకుడు - బతుల్ ముక్తియార్ (చిత్రం-కఫల్) (ఇండియా);
ఉత్తమ యాక్షన్ స్క్రీన్ప్లే - నోనో: ది జిగ్జాగ్ కిడ్ (నెదర్లాండ్స్)
యానిమేషన్
ఉత్తమ చిత్రం - ఎర్నస్ట్ అండ్ సెలిస్టీన్ (ఫ్రాన్స్);
ఉత్తమ ద్వితీయ చిత్రం - జరాఫా (ఫ్రాన్స్);
ఉత్తమ ఆర్ట్ వర్క్ - ది వరల్డ్ ఆఫ్ గోపీ అండ్ భాగా (ఇండియా); ప్రత్యేక జ్యూరీ ప్రైజ్ - మూన్ మ్యాన్ (జర్మనీ);
ఉత్తమ చిత్రం (చిల్డ్రన్ జ్యూరీ) - అర్జున్ (ఇండియా)

లఘు చిత్రం
ఉత్తమ చిత్రం - చింటీ (రష్యా);
ఉత్తమ ద్వితీయ చిత్రం - నూడుల్ ఫిష్ (దక్షిణ కొరియా);
ఉత్తమ చిత్రం (చిల్డ్రన్ జ్యూరీ) - ద పప్పెట్ (ఇండియా), మై షూష్ (ట్యునీషియా)
బాల దర్శకులు
ఉత్తమ దర్శకుడు - సిద్ధాంత్ జోషి (బ్రేకింగ్ ద సైలెన్స్); పవన్ జ్యోత్ సింగ్, అంజలి బజాజ్, అభిషేక్ శర్మ (టమాటో చోర్);
ఉత్తమ ద్వితీయ దర్శకుడు - శ్వేత, మనీష్, రాని, శుభం (హెరిటేజ్ ఆఫ్ అవర్ స్కూల్); ఎకోల్ మాన్డియేల్ వరల్డ్ పాఠశాల 35గ్రేడ్ 8వ తరగతి విద్యార్థులు (ఫర్ ది లవ్ ఆఫ్ ఏ క్యాట్); ఉత్తమ దర్శకుడు (చిల్డ్రన్ జ్యూరీ) - అజ్యింక హుకెరికర్ (దిట్రక్); శంబుక్ బిస్వాస్, సయ్యద్ ముజ్తబా అలి (అవర్ బిట్); అనన్య సేన్ (గివ్ మీ ఏ ఛాన్స్)


Click it and Unblock the Notifications











