సమైక్యాంధ్ర ఛలో హైదరాబాద్: సీన్లోకి పవన్ కళ్యాణ్!
హైదరాబాద్: 'పోరాడితే పోయేదేం లేదు...బానిస సంకెళ్లు తప్ప, నువ్వు హైదరాబాద్ వస్తున్నావ్ అంతే' అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో చెప్పిన ఓ పవర్ ఫుల్ డైలాగు ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమానికి ఉపయోగపడుతోంది.
ఈ నెల 7న హైదరాబాద్లోని ఎల్బి స్టేడియంలో సమైక్యాంధ్ర నినాదంతో ఏపీ ఎన్జీఓలు చలో హైదరాబాద్ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభకు సమైక్యవాదులను ఆకర్షించేలా పవన్ కళ్యాణ్ సీన్తో ప్రచారం చేస్తున్నారు. పవర్ స్టార్ డైలాగ్ కావడంతో మంచి ఎఫెక్టివ్గా ఉంటుందని ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ డైలాగుతో కూడిన ఛలో హైదరాబాద్ ప్రకటన టీవీ ఛానళ్లలో ప్రసారం అవుతోంది.
ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సమైక్యాంధ్రకు గానీ, తెలంగాణకు గానీ మద్దతుగా మాట్లాడలేదు. ఆయనకు తెలంగాణ ప్రాంతంతో పాటు సీమాంధ్ర ప్రాంతంలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నటించిన సీన్ను సమైక్యాంధ్రకు మద్దతుగా వాడటం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే..... పవన్ కళ్యాణ్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' అప్పట్లో ఓ సీన్ కారణంగా తెలంగాణ ప్రాంతంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆయన ఇప్పుడు నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం సీమాంధ్ర ప్రాంతంలో విడుదల చేసే పరిస్థితి లేక పోవడంతో విడుదల వాయిదా పడింది. ఇలా రెండు ప్రాంతాల్లోనూ అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు....రెండు ప్రాంతాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొంది.


Click it and Unblock the Notifications












