ఉగాది రోజు పవన్ కీలక ప్రకటన.. ఆ కుటుంబాలకు అండగా ఆర్ధిక సహాయం!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఏపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. అయినా నిరాశ పడని పవన్ కళ్యాణ్ ఏపీ వాసులకు అండగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఆయన ఉగాది పర్వదినాన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

80 మందికి పైగా రైతులు
రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాలు... అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం అని అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాల్లో 80 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే సాగును నమ్ముకున్న వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అనేది అర్థం అవుతోందని అన్నారు.

లక్ష సహాయం
ఉగాది పూట ఆ కుటుంబాలు దుఖంతో, బాధతో ఉండకూడదు... వారికి కొంతైనా ఊరటను ఇవ్వాలి అనే ఉద్దేశంతో జనసేన పక్షాన ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించామని చెబుతూ ఒక ప్రకటన చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష రూపాయలు జనసేన ఆర్థిక సహాయం అందచేస్తుందని అన్నారు. ఆ రైతు కుటుంబాలలోని పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతైనా అండ ఇవ్వాలనే రూ.లక్ష సహాయం చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు.

కాయకష్టం వల్ల పండినవే
త్వరలోనే ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తానని పేర్కొన్న పవన్ ఆర్థిక సాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుందని అన్నారు. మనం ఈ రోజు తినే తిండి గింజలు 80 శాతం కౌలు రైతులు కాయకష్టం వల్ల పండినవేనని పేర్కొన్నారు. అలాంటి కౌలు రైతుల బాధలు గురించి తెలుసుకొంటుంటే హృదయం ద్రవిస్తుందని,కౌలు రైతులకు నిబంధనల పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని అన్నారు. సాగు చేసుకుంటే రుణం ఇవ్వరు... పంట నష్టపోతే పరిహారం ఇవ్వరని పవన్ అన్నారు.

3 వేల మందికిపైగా
ఆత్మహత్య చేసుకున్న వారికి ఆర్థిక సాయం అందించడం లేదు. కనీసం అధికారులు కూడా పరామర్శించి విచారించారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ రైతుల, కౌలు రైతుల పక్షాన నిలుస్తుందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 3 వేల మందికిపైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పవన్ విమర్శించారు. రాష్ట్రంలో 16 లక్షలకుపైగా కౌలు రైతులున్నారన్న పవన్..వారి సంక్షేమం పట్ల వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఫయిర్ అయ్యారు. అందుకే జనసేన తరఫున ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు పవన్ ప్రకటించారు.

150 మంది రైతుల కుటుంబాలకు
కౌలు రైతులు పండించే ధాన్యాన్ని రూ.700లకు కొంటున్న మిల్లర్లు అదే ధాన్యాన్ని రూ.1,400లకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ ముందు గోదావరి జిల్లాల్లో 80 కుటుంబాలకు, ఆ తర్వాత కర్నూలు, అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 150 మంది రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. తానే స్వయంగా రైతు కుటుంబాలను కలిసి ఆర్థిక సాయం అందిస్తామని పవన్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications











