#bringbacknetajiashes సీఎం చేయమనను.. సినిమా హిట్ చేయమని అడగను.. ఒక్కటే అడుతున్నా.. పవన్ కల్యాణ్ ఉద్వేగం
పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్టు ఎంవీఆర్ శాస్త్రి రాసిన నేతాజీ గ్రంధం సమీక్ష కార్యక్రమంలో నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన సమీక్ష సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు గడచిపోయాయి. ఆయన చనిపోయి 77 సంవత్సరాలు అయిపోయాయి. అయినా ఈ రోజుకీ ఆయన ఆస్థికలు ఎవరూ తీసుకురాలేదు. ఇప్పటికి మూడు కమిషన్లు వేశారు. అయినా ఉపయోగం లేదు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు లాంటి వాళ్లు ఎవరైనా తీసుకువద్దామనుకున్నా.. మాజీ ప్రధాని అటల్ బీహారి వాజపేయ్ లాంటి వాళ్లు ప్రయత్నించినా కుదరలేదు. దానికి కావాల్సింది ప్రజలు కోరుకోవడం. మనలాంటి వాళ్లు బలంగా కోరుకోవాలి. ఆ అస్తికలు రావాలి అని పవన్ కల్యాణ్ అన్నారు.

నేతాజీ పుస్తకం దైవ ప్రేరణ
ఎంవీఆర్ శాస్త్రి రాసిన నేతాజి పుస్తకం ఒక దైవ ప్రేరణ. ఆయన పోరాటం, చనిపోయిన విధానాన్ని ఎం.వి.ఆర్.శాస్త్రి స్పష్టంగా ఇందులో ప్రస్తావించారు. అంతకంటే ముందు రచయిత శాస్త్రి శైలి గురించి చెప్పాలి. శాస్త్రి గారు సెక్యులరిజం మీద పెక్యులరిజం అంటూ ఓ సెటైరికల్ పుస్తకం రాశారు. అందులో ఆయన రాసిన మాటలు.. ఒక ఇంటికి బృందావనం అనో శాంతినికేతన్ అనో ఫలకం వేసినంత మాత్రాన అది నిజంగా శాంతినికేతనో బృందావనమో అయిపోదు. అలాగే రాజ్యాంగంలో సెక్యులర్ పదం చేర్చినంత మాత్రాన సెక్యులర్ రాజ్యం అయిపోదు. ఆ పదాలు గుండెలోతుల్లో నుంచి రావాలి అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఆయన పుస్తకాలు దివ్యా ఔషదాలు
రచయిత, జర్నలిస్టు శాస్త్రి రచనా శైలి జబ్బులకు వేసే చేదు కషాయం లాంటిది. కషాయం ఇచ్చే డాక్టర్ నచ్చకపోయినా జబ్బు నయం కావడానికి అలాంటి డాక్టర్లే అవసరం. మన సమాజాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతలకు ఒక మేధావిగా, సీనియర్ జర్నలిస్టుగా, సోషల్ డాక్టర్ గా శాస్త్రి గారు రాస్తున్న పుస్తకాలు దివ్యా ఔషదాల్లాంటివి. ఆయన వాదనలో కొన్ని వాక్యాలు చాలా మందికి రుచించకపోయినా.. అందులో సత్యం తాలూకు శక్తి మాత్రం వెంటాడుతుంది అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

టోక్యోలో నేతాజీ అస్థికలు చూసి
ఖుషీ సినిమా తర్వాత మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం టోక్యో వెళ్లినప్పుడు నాడు పాస్పోర్ట్ ఆఫీసర్ శ్రీ రాజశేఖర్ గారు ఒక చోటుకు తీసుకువెళ్లారు. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలు ఉన్న రెంకోజీ టెంపుల్ అది. నేతాజీ అస్థికలు భద్రపరిచిన ఆయన కుమార్తె అక్కడ ఉన్నారు. ఆమె నేతాజీ అస్థికలు చూపిస్తే నా హృదయం ద్రవించుకుపోయింది. మన దేశంలో అక్రమాలు, అన్యాయాలు చేసిన వారికి పెద్ద పెద్ద స్మారకాలు కడతారు. చనిపోతే పెద్ద పెద్ద ఊరేగింపులు చేస్తారు. ఇలాంటి మహానుభావుడు ఇంతటి చైతన్యం కలిగించిన వ్యక్తి ఎందుకు దిక్కు లేకుండా అయిపోయారు అని అనుకున్నా. అక్కడ ఉన్న పుస్తకంలో ఒక మాట రాశాను. నేతాజీ అస్తికలు ఒక రోజు భారతదేశంలోకి తీసుకురావాలి అని రాశాను. ఈ విషయాన్ని ఇంత వరకు ఎవరితో పంచుకోలేదు అని పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు.

డీఎన్ఏ పరీక్షలు నిర్వహించ వచ్చు కదా?
ప్రస్తుతం నేతాజీ అస్థికల ప్రస్తావన రావడం యాదృచ్చికమే కావచ్చు. అస్థికలు ఆయనవో కాదో పరీక్షించాలి అనుకుంటే ఈ రోజు డీఎన్ఏ పరీక్షలు ఎన్నో వచ్చాయి. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి నేతాజీ అస్థికలు భారత్కు ఎందుకు తీసుకురారు అన్నది ఓ సగటు భారతీయుడిగా నా ఆవేదన. ఆ అస్థికలు చూస్తే నిజంగా ఏడుపు వచ్చింది. జపనీస్ సంస్కృతిలో భాగంగా పూర్వీకుల అస్థికలు దేవుడి గుడిలో భద్రపరుస్తారు. అలాంటిది ఎవరివో అక్కడ ఎందుకు పెడతారు. అవి కచ్చితంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారివి అని నేనే గాఢంగా నమ్మాను అని పవన్ కల్యాణ్ ఎమోషనల్ అయ్యారు.

నేతాజీ అస్థికలు భారత్కు తీసుకురావాలి
నేతాజీ అస్తికలు తిరిగి భారత దేశానికి తీసుకురావాలన్నదే నా కోరిక.. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోరిక అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. జపాన్ దేశంలోని రెంకోజీ టెంపుల్లో ఉండిపోయిన ఆయన అస్తికలు రెడ్ ఫోర్ట్ లో పెట్టాలని, దానిపై భారత మువ్వన్నెల జెండా ఎగరాలని డిమాండ్ చేశారు. అది చూసి ఆయన ఆత్మ శాంతించాలన్నారు. అది మనందరిలో నేతాజీ సుబాష్ చంద్రబోస్ స్ఫూర్తిని నింపాలన్నారు. అందుకోసం ఈ సభ నుంచి దేశం మొత్తం మాట్లాడుకునేలా.. నేతాజీ తాలూకు అస్తికలు తిరిగి దేశానికి తెప్పించేందుకు ప్రభుత్వాధినేతల మీద, రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తీసుకురావాలి అని పవన్ కల్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

సీఎం పదవి అడగను.. అంటూ
నేను ప్రజల వినోదాలు, విలాసాలు, విందులను తగ్గించమని అడుగను. కానీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గుర్తు పెట్టుకోకపోతే ఈ దేశంలో ఉండే అర్హత మనకు లేనట్టే. మీకు ఉన్న 24 గంటల్లో 23 గంటల 45 నిమిషాలు దేశం కోసం కేటాయించండి. ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా. నేను ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవులు అడగను. పెద్ద పెద్ద పదవులు అడగను. నా సినిమాలు హిట్ చేయమని అడగను. నా సినిమాలు చూడమని అడగను. నన్ను ముఖ్యమంత్రి చేయని అడుగను. నేను ఈ రోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. నేతాజీ అస్థికలు భారత్కు తీసుకురావడానికి నిలబడమని అడుగుతున్నా. దానిపై మనసు పెట్టమని అభ్యర్థిస్తున్నా అని పవన్ కల్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు.

ఉద్యమం చేయాలంటూ పవన్ కల్యాణ్ విన్నపం
నేతాజీ అస్థికలు భారత్కు రప్పించడంలో అందరం ఒక మాట మీద ఉండి ఒత్తిడి తీసుకురాకపోతే ఉదాసీనత నిండిన వ్యక్తుల్లో చలనం రాదు అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదిక నుంచే మనం ఆ పోరాటాన్ని మొదలుపెడదాం. అది ఒక రోజు దేశం మొత్తం విస్తరించాలి.. నేతాజీ అస్థికలు భారతదేశంలోకి రావాలి.. మనం ఆయనకు సెల్యూట్ చేయాలన్నారు. అందుకోసం #bringbacknetajiashes, #renkojitoredfort అనే హ్యాష్ ట్యాగ్స్ రూపొందించారు. ఈ హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి సోషల్ మీడియాలో ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలని ప్రజలను పవన్ కల్యాణ్ కోరారు.


Click it and Unblock the Notifications











