RRR, భీమ్లా నాయక్, అఖండకు భారీ షాక్.. ఏపీ అసెంబ్లీలో సినిమాటోగ్రఫి బిల్లు.. పేర్ని నాని ఏమన్నారంటే!
తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన నిర్మాతల ఆశలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు జల్లింది. గతంలో పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ రేట్ను పెంచుకొనే అవకాశం ఉండేది. కానీ ఏపీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు సినిమాటోగ్రఫి చట్టానికి సవరణ బిల్లును ఏపీ అసెంబ్లీలో మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి పేర్నినాని సినిమా పరిశ్రమకు సంబంధించిన వసూళ్లు, పన్ను చెల్లింపుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పేర్నినాని చెప్పిన విషయాలు ఏమిటంటే..

ప్రత్యేక ప్రదర్శనలకు నో అంటూ..
ఆంధ్రప్రదేశ్లో సినిమాల ప్రదర్శనలు, ప్రత్యేక ప్రదర్శనలు, పెద్ద సినిమాలకు సంబంధించిన టికెట్ రేటు పెంపు, తదితర అంశాలపై అనేక మార్పులు చేపడుతూ సినిమాటోగ్రఫి చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం ఆ బిల్లును ఏపీ అసెంబ్లీని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత సినిమా పరిశ్రమ గురించి ప్రభుత్వ విధానాన్ని మంత్రి పేర్నినాని వివరించారు.

ఏం చేసినా.. ఏమీ అనరనే ధీమాతో సినీ పరిశ్రమ
బిల్లు ప్రవేశపెట్టే నేపథ్యంలో మంత్రి పేర్ని నాని సభలో మాట్లాడుతూ.. రోజకు నాలుగు ఆటలే ప్రదర్శించాలనే నిబంధనను ఉల్లంఘించి.. సినిమా హాళ్లలో ఆరుకుపైగా షోలు వేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఏమి చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా ఎవ్వరు ఏమీ అనరు అనే ఉద్దేశంతో కొందరు ఉన్నారు అని పేర్ని నాని వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.

ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకోకుండా
పెద్ద సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లు పెంచడం వల్ల పేద, మధ్య తరగతి ప్రేక్షకులకు వినోదం కరువు అవుతున్నది. ప్రజల బలహీనతలు సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. ఇలాంటి అవకతవకలను అరికట్టాలంటే.. ఆన్లైన్లో టికెట్ అమ్మే విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇలాంటి విధానంతోనే ప్రజల సొమ్ముకు భద్రత అనేది సాధ్యమవుతుంది అని మంత్రి పేర్ని నాని సభలో తన అభిప్రాయాన్ని వెల్లడించినట్టు తెలిసింది.

ఇకపై ఏపీలో నాలుగు షోలే అంటూ..
ఆంధ్ర ప్రదేశ్లో ఇక నుంచి రోజుకు కేవలం 4 షోలు మాత్రమే ప్రదర్శించాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. ఆ నాలుగు షోలకు కూడా ఆన్లైన్ ద్వారా టికెట్లను అమ్మే ఆలోచనపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితోనే ఉంది. ఇంటి నుంచి ప్రేక్షకుడు కదలకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు టికెట్ లభించే విధంగా సినిమాటోగ్రఫి చట్టంలో మార్పులు తీసుకొస్తున్నాం. ఈ పద్దతి ద్వారా పన్ను విధింపుపై స్పష్టమైన విధానాలు రూపొందిస్తున్నాం అని మంత్రి పేర్ని నాని చెప్పారు.

పన్ను ఎగవేతపై కఠిన చర్యలు
సినిమా పరిశ్రమలో నిర్మాతలు చెప్పే కలెక్షన్లకు, చెల్లించే జీఎస్టీకి పొంతన ఉండటం లేదు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సక్రమంగా రాబట్టుకొంటాం. పన్ను ఎగవేత జరగకుండా చర్యలు తీసుకొంటాం. రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు ఆన్లైన్ టికెటింగ్ విధానంపై బురద జల్లుతున్నాయి. కొన్ని అపోహలు సృష్టిస్తూ.. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి అని మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించాయి.
Recommended Video

RRR, అఖండ, భీమ్లా నాయక్ నిర్మాతలకు షాక్
సినిమాల ప్రదర్శనలు, టికెట్ రేటుపై ఏపీ ప్రభుత్వం విధానం టాలీవుడ్ నిర్మాతల ఆశలపై నీళ్లు చల్లే విధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రానున్న రెండు మూడు నెలల్లో తెలుగు సినిమా పరిశ్రమలో భారీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. బాలకృష్ణ నటించిన అఖండ, నాని నటించిన శ్యామ్ సింగ రాయ్, రాజమౌళి దర్శకత్వంలో రానున్న RRR, పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్, మహేష్ బాబు నటించిన సర్కారు వారీ పాట, ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ లాంటి చిత్రాలు రిలీజ్కు సిద్దమవుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ సమయంలో ఎక్కువ షోలు, టికెట్ పెంపు విషయాలు నిర్మాతలకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది


Click it and Unblock the Notifications











