వర్మ '26/11 ఇండియాపై దాడి' పై హైకోర్టులో పిటిషన్
వివరాల్లోకి వెళితే...రామ్గోపాల్వర్మ దర్శకత్వం వహించిన '26/11 ఇండియాపై దాడి' చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తీగల రామ్ప్రసాద్ అనే న్యాయవాది హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడం సినిమాటోగ్రఫీ చట్టం - 1952తో పాటు రాజ్యాంగంలోని అర్టికల్ 14, 19, 21 వ్యతిరేకమని తెలిపారు. పిటిషన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
2008లో ముంబయ్లో జరిగిన తీవ్రవాద దాడుల నేపథ్యంలో రామ్గోపాల్వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఇండస్ ఇన్స్పిరేషన్స్ పతాకంపై ఎన్.ఎ.కాంతారావు నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. వర్మ మాట్లాడుతూ....నేను భయపడటమంటే ఈ సినిమా బాగా వస్తుందా లేదా? ప్రేక్షకులకు నచ్చుతుందా అని కాదు. 26/11 దాడుల సమయంలో ప్రత్యక్షంగా అక్కడ ఉన్న పోలీసు అధికారులు, ఇతర బాధితులు నాతో పంచుకొన్న విషయాల్ని నేను సరిగ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలుగుతానా లేదా? అనే భయంతో ఈ సినిమా చేశాను అన్నారు. అలాగే ఈ దాడులను ప్రత్యక్షంగా చూసిన బాధితుల తాలూకు ఉద్వేగం చాలా విలువైనది. దాన్ని చెడగొట్టకుండా తెరపైకి తీసుకురావాలనుకొన్నాను అన్నారు.
అలాగే పది మంది పడవలో నుంచి దిగి రెండు కోట్ల జనాభా ఉన్న ముంబై నగరాన్ని గడగడలాడించడం మామూలు విషయం కాదు. నాలుగేళ్లయినా ఆ దాడుల్ని మనం మరిచిపోలేకపోతున్నాం. అక్కడ ఏం జరిగిందనే విషయం అందరికీ తెలుసు. కానీ ఎలా జరిగిందన్నదే తెలియదు. ఆ రోజు రాత్రి 9:30 గంటల నుంచి ఒంటిగంట వరకు ఏం జరిగిందనే విషయాల్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నమే ఈ సినిమా. తాజ్ హోటల్లో ఉన్న ఓ మనిషి మనమే అయితే ఆ భావోద్వేగాలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపిస్తున్నాం. కసబ్ కాల్పులు జరుపుతున్నప్పుడు అతని భావోద్వేగాలు ఏమిటో ఎవ్వరికీ తెలియదు, ఏ పరిశోధనలోనూ ఆ విషయం తేలదు. కానీ నా వూహాకల్పనతో ఆ భావోద్వేగాల్ని చూపించాను అన్నారు.


Click it and Unblock the Notifications












