రాజకీయం ఇప్పుడు వ్యభిచారమే!... పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై పోసాని ఏమన్నారంటే...
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ గురించి మీడియాలో గత కొన్ని రోజులుగా తెగ హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన తెలుగు దేశం పార్టీలో చేరడానికి సిద్ధం అవుతున్నారంటూ గాసిప్స్ గుప్పుమనడంతో అంతా కంగారు పడ్డారు. అయితే ఎట్టకేలకు నాగబాబు స్పందించి....అవన్నీ రూమర్లే అని తేల్చేసారు అనుకోండి.
కాగా...ఓ టీవీ కార్యక్రమంలో నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఈ విషయమై తనదైన రీతిలో స్పందించారు. వాస్తవాలను నిర్మొహమాటంగా చెప్పే ఆయన పవన్ కళ్యాణ్ విషయంలో సంచలన కామెంట్ చేసారు. ఆయన మాటల్లో కాస్త ఆవేశం కనిపించినా, ఉన్న విషయం చెప్పారని అంటున్నారు పవన్ అభిమానులు.
'పవన్ కళ్యాణ్ ఒక మంచి వ్యక్తి. సున్నితమైన మనస్తత్వం కలవారు. ప్రస్తుతం రాజకీయాలు వ్యాపార స్థాయి నుంచి వ్యబిచారం స్థాయికి దిగజారి పోయాయి. రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయింది. ఇలాంటి రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారా? ఈ కుళ్లు రాజకీయాలతో సమాజం మరింత నాశనం అయిన తర్వాత, తప్పనిసరి పరిస్థితులు ఏర్పడితే పవన్ రాజకీయాల్లోకి వచ్చేఅవకాశం ఉంది' అని పోసాని కృష్ణ మురళి అభిప్రాయ పడ్డారు.
ఆయన వల్ల ఇప్పటి వరకు పరిశ్రమలో ఏ నిర్మాత నష్టపోలేదని, ఆయనలో ఉన్న మంచి వ్యక్తిని, ఆయనలోని పవర్ను 'గోకుళంలో సీత' సినిమా సమయంలోనే గమనించి తాను చిరంజీవికి చెప్పినట్లు పోసాని చెప్పుకొచ్చారు. ఒక వేళ భవిష్యత్లో పవన్ రాజకీయ పార్టీ పెడితే చేరుతానని వెల్లడించారు.


Click it and Unblock the Notifications












