ఆపదమొక్కులవాడు సినిమా దర్శకుడు పోసాని కృష్ణ మురళి ఆరోపణలన్నీ పచ్చి అపద్దాలనీ దాసరి నారాయణరావుకు చెందిన సిరి మీడియా సంస్థ ప్రతినిధి పిడి ప్రసాద్ ప్రతిస్పందించారు. మంగళవారం సాయంత్రం టీవీ9లో ప్రసాద్ మాట్లాడారు. ఆపదమొక్కులవాడు సినిమా విడుదలలో జరిగిన జాప్యానికి తమ సంస్థ ఎంతమాత్రం కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పోసాని మాట్లాడుతూ తమ సినిమా విడుదలలో జరిగిన జాప్యానికి కచ్చితంగా దాసరి నారాయణరావేనని బల్లగుద్ది చెప్పారు. పిడి ప్రసాద్ పై ఎమోషనల్ గా ఆరోపణలు గుప్పించారు. పిడి ప్రసాద్ మాత్రం ఎలాంటి ఎమోషన్ కు గురికాకుండా తమ సంస్థ తప్పులేదని నిరూపించే సాక్ష్యాలున్నాయని స్పష్టం చేశారు. ఆపదమొక్కులవాడు సినిమా విడుదలకు రెండురోజుల ముందు నుంచే పోసాని కనపడకుండా పోయారని ప్రసాద్ ఆరోపించారు. ఆపదమొక్కులవాడు సినిమా నిర్మాతను పోసాని నిండా ముంచారని అన్న ప్రసాద్ తన గురించి సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు పెద్దల మధ్య అగాధం సృష్టించడానికే పోసాని ఈ నాటకం ఆడుతున్నారని ప్రసాద్ వ్యాఖ్యానించారు. అందుకు సమాధానమిస్తూ సినిమా విజయాన్ని కోరుతూ దేవుని వద్దకు వెళ్లానని అన్నారు. తమ సినిమా విడుదల కాకుండా కుట్ర పన్ని తమను దాసరి నారాయణరావు చీట్ చేశారని పోసాని పదే పదే అన్నారు. తమ సినిమా విడుదలలో జాప్యానికి కారణమై సినిమాను కిల్ చేశారని పోసాని ఆవేశంగా అన్నారు. సహనం కోల్పోయిన పోసాని ఒక దశలో పిడి ప్రసాద్ ను భూతులు తిట్టారు.