దత్తత గ్రామంలో ప్రకాష్ రాజ్ చర్యలు ఇలా...
హైదరాబాద్: తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న సినీ నటుడు ప్రకాశ్ రాజ్ దత్తత గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇటీవల మహబూబ్నగర్ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సన్షైన్ ఆసుపత్రి వారితో సమావేశమై వైద్యుడు గురువారెడ్డి బృందంతో చర్చలు జరిపి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రకాశ్రాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ వైద్య బృందంతో దిగిన పై ఫొటోను పోస్ట్ చేశారు.
అలాగే...తమ ప్రకాష్ రాజ్ పౌండేషన్ కు విరాళాలు ఇచ్చి సహాయం చేయమంటూ కోరారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి స్ఫూర్తితో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసిన ఆయన తను చేయబోయే పనుల గురించి వివరించారు. ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ప్రకాష్ రాజ్ ఈ గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
ప్రకాష్ రాజ్ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేసారు. త్వరలోనే ప్రకాష్ రాజ్ కొండారెడ్డిపల్లిని సందర్శించి అక్కడి ప్రధాన సమస్యలు ఏమిటి? ఏం చేస్తే బావుంటుంది అనే అంశాలను పరిశీలించనున్నారు. ప్రణాళిక బద్దంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మహేష్ బాబు కూడా గ్యామజ్యోతి కార్యక్రమం స్పూర్తితో మంత్రి కేటీఆర్ సలహా మేరకు మహబూబ్ నగర్ జిల్లాలోని చింతలకుంట గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దీంతో పాటు ఆయన ఆంధ్రలో బుర్రిపాలెంను దత్తత తీసుకుని అభివృద్ది చేయాలని నిర్ణయించుకున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు కూడా తన సొంత చిత్తూరులో జిల్లాలో 10 గ్రామాలను దత్తత తీసుకున్నారు.
ఇటీవల ఇంటర్వ్యూలో మంచు విష్ణు స్పందిస్తూ.... చిత్రూరు జిల్లా చంద్రగిరి మండలంలో 10 గ్రామాలను దత్తత తీసుకున్నాను. అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేదిపై ప్లాన్ చేస్తున్నట్లు, త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.


Click it and Unblock the Notifications











