బాలకృష్ణ 'శ్రీరామ రాజ్యం' మొదలైన విధానం
బాలకృష్ణ,నయనతార కాంబినేషన్ లో బాపు రూపొందించిన పౌరాణిక చిత్రం 'శ్రీరామ రాజ్యం' . త్వరలో విడుదల కానున్న ఈ పౌరాణిక చిత్రం ఎలా మొదలైందో గుర్తు చేసుకున్నారు నిర్మాత యలమంచిలి సాయిబాబు. ఆయన మాటల్లోనే.. "ఓ ఆదివారం మధ్యాహ్నం రామసాయిమందిరం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. రాముడు గురించి సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న భావన అప్పుడే వచ్చింది. వెంటనే నా స్నేహితుడిని రమ్మని కబురుపెట్టాను. ఐదు నిమిషాల్లో వచ్చాడు. విషయం చెప్పగానే వెంటనే ముళ్ళపూడి రమణగారితో మాట్లాడించారు. వెంటనే బయలుదేరి చెన్నై వెళ్ళాం. మరుసటి రోజు బాపు-రమణగార్లను కలిశాం. అక్కడి నుంచి ఇళయరాజాగారిని కలిశాం. 'శ్రీరామరాజ్యం' శ్రీకారం చుట్టుకున్న వైనమిది'' అన్నారు. అలాగే షూటింగ్ లో మొదటి సీన్ చిత్రీకరణ గురించి చెబుతూ.. "మొదటి రోజు బాలకృష్ణగారు షూటింగ్లో ఉన్నారు. నేను కారు దిగి వెళ్తున్నాను. సీతాదేవిని భూదేవి తనతో తీసుకెళ్లే సన్నివేశమది. ముఖంలో పలు భావాలను పలికిస్తూ నటించాలి. దూరం నుంచి బాలకృష్ణ నటన చూస్తే చాలా ముచ్చటేసింది.
ఆ తర్వాత ఆయన ఎన్ని సన్నివేశాలు చేసినా, నేను చూసినా... నాకు నచ్చింది తొలి సన్నివేశమే. పూర్తిగా పాత్రలో లీనమై నటించే నటుడు బాలయ్య. ఈ చిత్రంలో నటించినన్నాళ్ళూ ఆయనలో ఏదో తేజస్సు కనిపించేది. అది దినదినప్రవర్ధమానమైనట్టు అనిపించింది. రాముడి పాత్రలో ఆయన్ని చూసిన కొంతమంది యువకులు 'అచ్చం రామారావుగారిలా ఉన్నారు కదా' అనడం స్వయానా నేనే విన్నాను. చాలా ఆనందమనిపించింది. అంతే భక్తి శ్రద్ధలతో నయనతార నటించింది. సీత పాత్ర చేసినన్నాళ్ళూ తను శాకాహారమే తీసుకుంది. ఏరోజూ గుడికెళ్ళకుండా సెట్కు రాలేదు. నేను చూసిన వారందరిలోకీ నయనతార గొప్ప వ్యక్తిత్వమున్న అమ్మాయి. తన వృత్తికి పూర్తి న్యాయం చేసే తరహా మనిషి అన్నారు. ప్రస్తుతం నేపథ్యసంగీతం పనులు జరుగుతున్నాయి. హంగేరి రాజధానిబుడాఫెస్ట్లో ట్రాక్ మిక్సింగ్ కార్యక్రమాలు త్వరలో ఉంటాయి. హంగేరి నుంచి ఎనిమిది మంది సభ్యులు ఇప్పుడున్న రీరికార్డింగ్ బృందంతో త్వరలో కలుస్తారు. మరోవైపు గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తి కావచ్చాయి. ఇక డీఐ, డీటీయస్ పనులున్నాయి. వాటిని కూడా ముగించి అక్టోబర్ లోపు చిత్రాన్ని ప్రేక్షకులకు కనువిందు చేయాలనుకుంటున్నాం అని చెప్పకొచ్చారు.


Click it and Unblock the Notifications











