ఆ నిర్మాత రూ. 84 కోట్లను తన ప్రేయసి ఇంట్లో దాచాడా?
ఎస్సారెమ్ కేసులో స్వాహా చేసిన కోట్లాది రూపాయలను నిర్మాత మదన్ తన ప్రేయసి ఇంట్లో దాచినట్లు పోలీసులు అనుమానించారు. దీంతో అతన్ని తిరువూరులోని ఆమె నివాసంలో ప్రశ్నించారు.
చెన్నై: ఎస్సారెమ్ విశ్వ విద్యాలయం మెడిసిన్ సీట్ల డొనేషన్ల సొమ్ము మోసం కేసులో అరెస్టయిన వేందర్ మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత మదన్ను క్రైం పోలీసులు తిరుప్పూరుకు తీసుకెళ్లి విచారించారు. అతను తన వద్ద గల సొమ్మును ఎక్కడ దాచాడనే విషయంపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఎస్సారెమ్ వర్సిటీ డొనేషన్ల రూపంలో వసూలు చేసిన రూ.84 కోట్లను మదన్ స్వాహా చేశాడనే ఆరోపణలపై క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడు రోజులపాటు కస్టడీకి తీసుకుని ఆయనను విచారిచారు. కోర్టు ఆదేశం ప్రకారం మరో రెండు రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. డొనేషన్ల సొమ్మును ఎక్కడదాచావంటూ క్రైం పోలీసులు ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

తిరుప్పూరులో తాను అజ్ఞాతవాసం చేసిన ప్రేయసి ఇంట్లో దాచానని అతను చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో మదన్ను పోలీసులు బుధవారం తెల్లవారు జామున తిరుప్పూరుకు తీసుకెళ్లారు. తిరుప్పూరులోని అతని ప్రేయసి నివాసగృహంలో విచారించారు. ఈ విచారణలో మదన్ ప్రేయసి కూడా పాల్గొన్నట్లు చెబుతున్నారు.
మదన్ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు జరిపిన కార్యకలాపాలను గురించి, అతడు కొనుగోలు చేసిన స్థిర, చరాస్తుల వివరాలను గురించి పోలీసులు అతని ప్రేయసిని కూడా ప్రశ్నించినట్లు చెబుతున్నారు. అయితే మదన్ తన ప్రేయసి ఇంట్లో సొమ్మును దాచలేదని పోలీసులు నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది.
అజ్ఞాతంలో ఉన్నప్పుడు మదన్ ఉత్తరాఖండ్లో కొన్ని ఇళ్లను కొనుగోలు చేశాడని పోలీసులు గుర్తించారు. మదన్ తక్కువ నగదును తన వద్ద ఉంచుకుని సంచరించాడని తెలుసుకున్నారు. తిరుప్పూరులో విచారణ ముగియగానే మదన్ను గట్టి బందోబస్తు మధ్య వ్యాన్లో చెన్నైకి తీసుకువచ్చారు.


Click it and Unblock the Notifications











