డ్రామా, అప్పుల్ని నాపై రుద్దే ప్రయత్నం: పూరి
హైదరాబాద్: 'లోఫర్' చిత్రానికి సంబంధించి దర్శకుడు పూరి జగన్నాథ్, ఆ చిత్రానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, ముత్యాలు, సుధీర్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. వారు తమ ఇంటిపైకి వచ్చి దాడి చేసారని, బెదిరించారని పూరి ఫిర్యాదు చేస్తే.... తాము అసలు పూరి ఇంటికే వెళ్లలేదని, దాడి చేయలేదని, తమపై తప్పుడు కేసులు పెట్టారంటూ డిస్ట్రిబ్యూటర్లు వాదిస్తున్నారు. దాడి చేసినట్లు ఏవైనా ఆధారాలుంటే చూపించాలని కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు మాపై కేసు ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. లోఫర్ సినిమాకు నష్టాలు రావడంతో మూడునెలల క్రితం తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేశామని... అది సాధారణంగా జరిగేదే అని చెప్పారు.
'లోఫర్' వివాదంపై పూరి మరోసారి స్పందిస్తూ డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్బెయిల్ చేసి తప్పుడు లెక్కలు చూపారని పూరి తెలిపారు. లోఫర్ సినిమా విడుదలకు ముందే అభిషేక్, సుధీర్లు తనను కలిసారు. వారి బ్యానర్లో తాను 5సినిమాలు చేసేలా అగ్రిమెంట్ చేసుకుందామన్నారు. ప్రత్యేకంగా తనకొక సినిమా చేయాలని ముత్యాల రాందాస్ అడిగారని..ఆ తర్వాతగానీ వారి ఉద్దేశమేంటో తనకు అర్థం కాలేదన్నారు.

తనతో సినిమా ఒప్పందాల పేరుతో వాళ్లకున్న అప్పుల్ని తనపై రుద్దే ప్రయత్నం చేశారని పూరి వెల్లడించారు. వాళ్ల నష్టాలకు తనను బాధ్యున్ని చేయాలని చూశారన్నారు. లోఫర్ సినిమా నైజాం హక్కుల్ని రూ.7.5కోట్లకు కొన్నామని సుధీర్ చెప్పాడని..కానీ నైజాం హక్కులు రూ.3.4 కోట్లకే అమ్మినట్టు నిర్మాత సీ కళ్యాణ్ చెప్పారని వెల్లడించారు. ఈ అంశాలను బట్టి ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు ఎంత డ్రామా ఆడారో అర్థమవుతోందన్నారు.
ఈ వివాదంపై లోఫర్ నిర్మాత సి.కళ్యాణ్ స్పందిస్తూ డిస్ట్రిబ్యూటర్లు దాడి చేసే మనస్తత్వం ఉన్నవారు కాదని, పూరీతో ఈ విషయంపై తాను మాట్లాడానని... లోఫర్ సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లకు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేదని చెప్పారు. ఈ సమస్యను తాము పరిష్కరించుకుంటామని తెలిపారు.


Click it and Unblock the Notifications











