వినాయక్ ఆదుకున్నారు...పూరి అలా చేయడం లేదేం?
హైదరాబాద్: లోఫర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, దర్శకుడు పూరి జగన్నాథ్ మధ్య వివాదం ఇంకా రగులూనే ఉంది. లోఫర్ డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్, రాందాస్ తనపై దాడి చేసారంటూ పూరి జగన్నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే డిస్ట్రిబ్యూటర్ల వాదన మాత్రం మరోలా ఉంది. అసలు తాము పూరి ఇంటికి గానీ, ఆఫీసుకు గానీ వెళ్లలేదని, ఫోన్ లో కూడా బెదిరింపులకు దిగలేదని...తమపై తప్పుడు కేసులు పెట్టారని, పూరి ఇంటి వద్ద, ఆఫీసు వద్ద సీసీ కెమెరాలు పరిశీలిస్తే నిజా నిజాలు బయట పడతాయని అన్నారు.
గతంలో తాము 'అఖిల్' చిత్ర డిస్ట్రిబ్యూట్ చేసాం. విడుదలైన రెండవ రోజునే దర్శకుడు వీవీ వినాయక్ తమకు ఫోన్ చేసి, సినిమా ఫ్లాప్ అయిందని బాధ పడవద్దని, మీ వెనుక నేనున్నానని ధైర్యం చెప్పారని, లోఫర్ విషయంలో పూరీ జగన్నాథ్ ఆ పని చేయలేకపోయారు... పూరి ఆ బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.

సినిమా పరిశ్రమలో భాగమైన తమను కాపాడాల్సిన బాధ్యత కూడా ఉందన్న విషయాన్ని పూరి, లోఫర్ నిర్మాత మరిచారని ఆరోపించారు. సినిమా హిట్ అయితే, లాభాల్లో 20 శాతమే తమకు దక్కుతోందని, నష్టపోయిన వేళ, 20 శాతం పెట్టుబడినే తాము కోరుతున్నామని తెలిపారు. గతంలో మహేశ్ బాబు, రజనీకాంత్ తదితరులు తమ చిత్రాలు నష్టపోయిన వేళ, డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్నారని గుర్తు చేసారు.
భారీగా నష్టపోయిన తమను ఆదుకోకపోగా, తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని...ఇదెక్కడి న్యాయం అని డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్, రాందాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పూరిపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని, తమపై తప్పుడు కేసులు పెట్టారు. విచారణ జరిపిన తర్వాత తమ తప్పుంటే తమపై చర్యలు తీసుకోవాలన్నారు.


Click it and Unblock the Notifications











