చెంగల బెదిరించాడని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఫిర్యాదు
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ హైదరాబాద్ నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) డిసిపి సత్యనారాయణపై, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు, సినీ నిర్మాత చెంగల వెంకట్రావుపై మానవ హక్కుల కమీషన్ (సిసిఎస్)కు ఫిర్యాదు చేశారు. దీనిపై మే 9వ తేదీలోగా తమకు నివేదిక సమర్పించాలని కమిషన్ మంగళవారం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ను ఆదేశించింది. సత్యనారాయణ రావు, చెంగల వెంకట్రావు, మరో సిఐ ఏప్రిల్ 16వ తేదీన తనను కిడ్నాప్ చేసి, సిసిఎస్ కార్యాలయంలో నిర్బంధించి తనను కొట్టారని, 60 లక్షల రూపాయల చెక్కు రాయించుకున్నారని విజయేంద్ర ప్రసాద్ ఫిర్యాదు చేశారు.
చెంగల వెంకట్రావు తన వద్దకు ఓ కథ కోసం వచ్చారని, తనకు డబ్బులివ్వకుండా 30 లక్షల రూపాయలకు రశీదు తీసుకున్నారని, ఆ తర్వాత వేధించడం ప్రారంభించారని ఆయన ఆరోపించారు. తాను చెంగల వెంకట్రావుకు ఏ విధమైన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అయితే, విజయేంద్ర ప్రసాద్తో తనకు ఏ విధమైన సంబంధం లేదని, తాను విజయేంద్ర ప్రసాద్తో ఫోన్లో కూడా మాట్లాడలేదని సత్యనారాయణ అంటున్నారు. చెంగల వెంకట్రావు విజయేంద్ర ప్రసాద్పై కోర్టుకెక్కారని, కోర్టు ఆదేశాల మేరకు తాము దర్యాప్తు చేపట్టాల్సి వచ్చిందని, ఆ కేసు దర్యాప్తును తాను ఓ సిఐకి అప్పగించానని, తాను ఆ కేసులో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











