'బాహుబలి' ఏడాది పూర్తైంది...(స్పెషల్ వీడియో)
హైదరాబాద్: ఈ రోజుతో 'బాహుబలి' విడుదలై ఏడాది గడుస్తున్న సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ వీడియోని ట్వీట్ చేశారు. చూసిన ప్రతీ ఒక్కరికీ ధాంక్స్ చెప్పారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడండి.
అలాగే ఎస్.ఎస్. రాజమౌళి మరో విషయం చెప్తూ... '13 ఏళ్ల క్రితం ఇదే రోజు సింహాద్రి విడుదల, చాలా సంతోషంగా ఉన్నాం. 12 ఏళ్ల తర్వాత.. బాహుబలి విడుదలకు ముందు రోజు, చాలా భయంతో ఉన్నాం' అని అన్నారు.
ఎన్టీఆర్ హీరోగా ఆయన దర్శకత్వంలో విడుదలైన 'సింహాద్రి' చిత్రం విడుదల రోజు చాలా సంతోషంగా ఉన్నామని, కానీ బాహుబలి విడుదలకు ముందు ఉత్కంఠతో ఉన్నామని తెలిపారు.
2015 జులై 10న ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'బాహుబలి' చిత్రం విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా తీస్తున్న 'బాహుబలి: ది కన్క్లూజన్' చిత్రం షూటింగ్ జరుగుతోంది.
మరో ప్రక్క 'బాహుబలి: ది బిగినింగ్' చిత్రం వివిధ దేశాల్లో విడుదలౌతోంది. తాజాగా పారిస్లో రిలీజ్ అయిన ఈ చిత్రం త్వరలో చైనాలో విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లు రాబట్టి, రికార్డు సృష్టించిన ఈ సినిమాని జులై 22న చైనా స్క్రీన్స్పై ప్రదర్శిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా చైనా భాషలో ఒక పోస్టర్ను విడుదల చేసింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











