దాసరి మరణంపై బాలయ్య, వర్మ, బ్రహ్మానందం స్పందన
దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. షూటింగులో భాగంగా పోర్చుగల్ లో ఉన్న బాలయ్య సంతాపం తెలిపారు. దాసరితో అనుబంధం ఎప్పటికీ మరవలేనిదన్నారు.
దాసరి మరణంపై దర్శకుడు రాం గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. మళ్లీ త్వరగా పుట్టెయ్యాలని కోరారు. దర్శకుడనే కుర్చీకి గుర్తింపు తెచ్చిందే దాసరి అని చెప్పిన వర్మ త్వరగా మళ్లీ పుట్టి ఆ కుర్చీలో కూర్చోవాలని అభిలషించారు.

దాసరి మరణం చాలా బాధాకరమని, షాక్కు గురైనట్లు నటి రాధిక తెలిపారు. రాముడు కాదు కృష్ణుడు సినిమాతో దాసరి పరిచయమయ్యారని ఆమె చెప్పారు. ఆ తర్వాత దాసరి దర్శకత్వంలో రెండు, మూడు సినిమాల్లో నటించినట్లు తెలిపారు. దాసరి ఒక సింహంలా ఉంటారని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్ట్రాంగ్ పర్శన్ని కోల్పోయిందని రాధిక చెప్పారు.
తుదిశ్వాస విడిచిన దర్శకరత్న దాసరి నారాయణరావుకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం నివాళులర్పించారు. మంచితనానికి, సహాయానికి మరోపేరు దాసరి అంటూ మహామహులెందరో ఆయన శిష్యులై రాణించారన్నారు.
దాసరి నారాయణరావు లేరన్న విషయం జీర్ణించుకోలేనిదని కమెడియన్ పృధ్వీ అన్నారు. దాసరి ఎప్పుడూ ఇండస్ట్రీకి పెద్ద దిక్కులా ఉండేవారని, రెండు నెలల ముందు కూడా ఆయనతో మాట్లాడడం జరిగిందన్నారు. ఇప్పుడు మనతో లేరంటే నమ్మలేకపోతున్నానని, దాసరి లేని పరిశ్రమ ఎటు వెళ్తుందో అని భయంగా ఉందన్నారు.
దర్శకులకు స్టార్ డమ్ తీసుకొచ్చిన వ్యక్తి దర్శకరత్న దాసరి నారాయణరావు అని కొనియాడారు నిర్మాత సురేశ్ బాబు. దాసరి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన సురేశ్ బాబు, ఆయన అన్ని రకాల సినిమాలూ తీశారని, ఒకేరోజు నాలుగైదు సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రతిభావంతుడని గుర్తు చేసుకున్నారు.
దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి పట్ల ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు స్పందించారు. తన సినీ జీవితంలో దాసరి లాంటి వ్యక్తిని చూడలేదన్నారు గొల్లపూడి. దాసరి దగ్గర 40 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు పనిచేసేవారు చెప్పారు. దాసరి గొప్ప క్రియేటివ్ రైటర్ అని గొల్లపూడి కొనియాడారు.


Click it and Unblock the Notifications











