సీఎం వైఎస్ జగన్, మంత్రి పేర్ని నాని బ్రేక్ డ్యాన్స్.. టికెట్ రేట్ల తగ్గింపుపై రాంగోపాల్ వర్మ సెటైర్లు
తెలుగు సినిమా పరిశ్రమకు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య కొద్ది నెలల క్రితం టికెట్ రేట్ల పెంపుపై భారీ యుద్ధమే జరిగినంత పనైంది. తమకు టికెట్ రేట్లు పెంచుకొనే హక్కు ఉందనే విషయంపై టాలీవుడ్ వాదనలు ఒకవైపు.. లేదు.. సినిమా టికెట్ రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నది ఏపీ ప్రభుత్వానికి వాదన మరోవైపు పెద్ద వివాదానికి దారి తీశాయి. అయితే ఇటీవల టికెట్ రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు ముఖం చాటేయడంతో సినీ వర్గాలు టిక్కెట్ రేట్ల తగ్గింపుకు పట్టుబడుతున్నారు. ఈ అంశంపై ప్రముఖ టెలివిజన్ ఛానెల్కు దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఏమిటంటే?

సినీ ఇండస్ట్రీ భయంతో
టికెట్ రేట్ల పెంపు, తగ్గింపు వివాదం పెద్ద జోక్ అనేది నా అభిప్రాయం. సినిమా తీస్తే జనం చూస్తారా? సినిమా ఆడితే ఎందుకు చూశారనేది ఓ కన్ఫ్యూషన్. దాంతో సినిమా ఇండస్ట్రీ భయంతో బతుకుతుంది. సినిమాలు నడుస్తాయా? సినిమా ప్రేక్షకులు చూస్తారా అనేది ఎవరూ ఊహించలేరు. సినిమాలు ఎందుకు ఆడటం లేదు.. ఎందుకు ఆడాయనేది ఎప్పటికే సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతాయి అని రాంగోపాల్ వర్మ అన్నారు.

ఏపీ సీఎంను బతిలాడి..
టికెట్ రేట్లు పెంచాలంటూ సినీ హీరోలు, నిర్మాతలు చేసిన వ్యాఖ్యలు గందరగోళం సృష్టించాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో ఉండాలని టికెట్ రేట్లు తగ్గించడంపై సినీ వర్గాలు ఆందోళన చెందారు. సినీ పెద్దలకు ప్రభుత్వానికి చర్చలు జరిగాయి. అగ్రహీరోలందరూ ఏపీ సీఎంను బతిమిలాడి.. ఆయనను ఒప్పించి టికెట్ రేట్లు పెంచుకొనేలా అనుమతి తెచ్చుకోవడంతో ఈ వివాదానికి పుల్స్టాప్ పడింది.

థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడంతో
కానీ టికెట్ రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు ఎవరు రావడం లేదనే విషయం ఇటీవల విడుదలైన అగ్ర హీరోల సినిమాలు ఆచార్య, రాధేశ్యామ్, సర్కారు వారీ పాట తదితర చిత్రాలు నిరూపించాయి. దాంతో దిల్ రాజు తన F3 చిత్రానికి టికెట్ రేట్లు తగ్గించి సినిమాను విడుదల చేయడం చర్చనీయాంశమైంది.

దిల్ రాజు నిర్ణయంపై
దిల్ రాజు, ఇతర నిర్మాతలు టికెట్ల రేట్లు తగ్గించాలని నిర్ణయం తీసుకోవడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్, అప్పటి మంత్రి పేర్ని నాని పగలబడి నవ్వుకొని ఉంటారు. సినీ నిర్మాతల నిర్ణయాలు చూసి ఇంట్లో బ్రేక్ డ్యాన్సులు చేసి ఉన్నా ఆశ్చర్య పోనక్కర్లేదు అని సినీ నిర్మాతలపై రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు.

చిరంజీవి సినిమా ఫ్లాప్ అంటూ..
గతంలో చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజైనప్పుడు తుఫాను కారణంగా వరదలు వచ్చాయి. అయితే ఆ సమయంలో చిరంజీవి సినిమా పనైందని అందరూ అనుకొన్నారు. కానీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఎందుకు హిట్ అయిందని అంటే.. ప్రేక్షకులకు పనిలేదు కాబట్టి థియేటర్కు వచ్చి సినిమా చూశారు అని లాజిక్ వెతికారు. అయితే సినిమా హిట్టు, ఫ్లాప్ను అంచనావేయడం కష్టం అని రాంగోపాల్ వర్మ తెలిపారు.


Click it and Unblock the Notifications











