ప్రేమించే వ్యక్తులను పొట్టన పెట్టుకొంటున్నాడు.. ఇంకా దేవుడిని పూజిస్తారా? వరుస విషాదాలతో వర్మ, జేడీ చక్రవర్తి
చావు పుట్టుకలకు అతీతంగా, భావోద్వేగాలకు దూరంగా కనిపించే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎమోషనల్గా స్పందించారు. తన సోదరుడు పీ సోమశేఖర్ మరణంతో ఆయన తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇటీవల వర్మను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తనకు అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు, మిత్రుడు గౌరవ్ శర్మ కరోనా బారిన పడి మరణించిన విషాదం నుంచి తేరుకోకు ముందే వర్మ మరో గుండెకోతకు గురయ్యారు. సోమశేఖర్ మరణంపై వర్మతోపాటు జేడీ చక్రవర్తి కూడా భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో వారిద్దరూ స్పందిస్తూ..

రంగీలా, సత్య, కంపెనీ సినిమాలకు
నా కజిన్ సోమశేఖర్ నాతోపాటు రంగీలా, దౌడ్, సత్య, జంగిల్, కంపెనీ సినిమాలకు పనిచేశారు. గత కొద్దికాలంగా మరో బిజినెస్లో కీలకంగా మారడంతో ఆయన నాకు, సినిమా రంగానికి దూరంగా ఉన్నారు. నా జీవితంలో అత్యంత కీలకమైన పాత్రను పోషించిన వ్యక్తి ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

జేడీ చక్రవర్తి, సోమశేఖర్ అనుబంధం
సోమ శేఖర్తో అనుబంధాన్ని జేడీ చక్రవర్తి పంచుకొన్నారు. నాకు 33 ఏళ్లుగా శేఖర్ తెలుసు. రామూజీ కంటే శేఖర్ను చూసే ఎక్కువగా భయపడేవాళ్లం. చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆయన ఎప్పుడూ రాము చెవిలో గుసగుసలాడుతుంటే.. మా గురించి ఏమైనా ఫిర్యాదులు చేస్తున్నాడా అనే భయం కలిగేది అంటూ జేడీ చెప్పారు.

సోమశేఖర్తో ఎప్పుడూ తగువులే కానీ..
సత్య షూటింగ్ కోసం ముంబై వెళ్లిన సమయంలో ఓ అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకొన్నాం. ఆ ఆపార్ట్మెంట్ శేఖర్కు నచ్చడంతో అక్కడే కలసి ఉన్నాం. చాలా సందర్భాల్లో తగువులాడుకొనే వాళ్లం. కానీ వెంటనే మళ్లీ మాట్లాడుకొనే వాళ్లం. కొద్దికాలంగా ఆయన ఎవరితో కలువకుండా ఒంటరిగా ఉండిపోయారు. ఫోన్ చేసినా కాల్స్కు అటెండ్ చేయలేకపోయేవారు. అది నన్ను చాలా బాధించింది. కానీ కరోనా మహమ్మారి ఆయనను ఈ లోకం నుంచి తీసుకెళ్లడం చాలా బాధగా ఉంది. నా కంటే శేఖర్ లేని లోటు రాముకే ఎక్కువ అని జేడీ తెలిపారు.

నా లైఫ్లో కీలక పాత్ర అంటూ ఆర్జీవి
ఇక తన కజిన్ సోమశేఖర్ మరణించడంపై రాంగోపాల్ వర్మ ఎమోషనల్ అయ్యారు. కోవిడ్ కారణంగా నా కజిన్ శేఖర్ మరణించారు. నా లైఫ్లో ప్రధానమైన భూమికను పోషించారు. శేఖర్ ఇక లేరని ఆయనకు తెలిసిన వారందరికీ సోషల్ మీడియా నుంచి ఈ విషాద వార్తను పంచుకొంటున్నాను. శేఖర్ లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
Recommended Video

అలాంటి దేవుడిని పూజించడం అవసరమా?
శేఖర్ మరణంతో వర్మ వైరాగ్యంగా స్పందిస్తూ.. దేవుడు ఈ లోకంలో అన్నీ సృష్టించాడు. మనం ప్రేమించే వ్యక్తులను పొట్టనబెట్టుకొంటున్న కరోనాను కూడా ఆయనే సృష్టించాడని అనుకొంటాను. ఇలాంటి దారుణాలు చేస్తున్న దేవుడిని ఇంకా ప్రార్థించడం అవసరమా?????? అంటూ ఆర్జీవి ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











