నేను శైలజ: పైరసీ చూస్తే జస్ట్ రూ. 2 లక్షల జరిమానా!
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను ఎప్పటి నుండో వేధిస్తున్న సమస్య పైరసీ. నిర్మాతలకు తీవ్రంగా నష్టపరుస్తున్న పైరసీని అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంటర్నెట్ ద్వారా ఏదో ఒక రకంగా పైరసీ జరుగుతూనే ఉంది. ఒక్కటి మాత్రం నిజం. పైరసీ చూసే ప్రేక్షకులు ఉన్నంత కాలం ఇది ఇలాగే జరుగుతుంది.
ఇటీవల విడుదలైన హిట్ సినిమా 'నేను శైలజ' విషయంలో కూడా భారీగా పరసీ జరుగుతోంది. చాలా మంది ఈ చిత్రాన్ని ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న 'స్రవంతి మూవీస్' అధినేత రవికిశోర్ తగిన చర్యలు తీసుకుంటున్నారు.
ఈ సినిమా డౌన్లోడ్ చేస్తున్న వారి ఐపీ అడ్రస్ను అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో తెలుసుకుని, వారి మీద తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డౌన్లోడ్ చేసుకుని చూసేవాళ్లకు 2 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని రవికిశోర్ తెలిపారు. పైరసీ చేసేవాళ్లను చట్టపరంగా ఎదుర్కొంటామనీ, వారికి కఠిన శిక్ష తప్పదనీ ఆయన స్పష్టం చేశారు.

దీనిపై నిర్మాత రవికిశోర్ మాట్లాడుతూ - ''అనధికారిక కాపీని డౌన్లోడ్ చేసేవాళ్లకు ఐదు వేల నుంచి ఏడు వేల ఆస్ర్టేలియన్ డాలర్లు జరిమానా విధించవచ్చని 'డల్లాస్ మూవీ బయ్యర్స్ క్లబ్'కు ఇటీవల ఆస్ర్టేలియన్ కోర్టు అనుమతినిచ్చింది. పలు వాదోపవాదాలు జరిగిన తర్వాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. యూస్లో కూడా వార్నర్ బ్రదర్స్ సంస్థ డౌన్ లోడ్ చేస్తున్నవారికి భారీగా జరిమానా విధిస్తోంది. భారతీయ చట్ట ప్రకారం రెండు లక్షల రూపాయలు జరిమానా విధించవచ్చు. 'నేను శైలజ'ను డౌన్ లోడ్ చేస్తున్నవారి ఐపీ అడ్రస్ లను సేకరిస్తున్నాం. అందరికీ చట్టపరంగా నోటీసులు పంపించనున్నాం'' అని చెప్పారు.
శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ హీరోగా స్రవంతి రవికిషోర్ నిర్మించిన చిత్రం నేను శైలజ. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి మార్నింగ్ షో నుంచే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మధ్య వరుస ప్లాపులతో సతమతం అయిన రామ్ ... ఈ చిత్రం మంచి ఫలితాలు ఇవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.


Click it and Unblock the Notifications











