జూ ఎన్టీఆర్ బృందావనం విడుదల వాయిదా: మహేష్ ఖలేజా భయం
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బృందావనం సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 9వ తేదీన ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, విడుదలను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసినట్లు చిత్ర నిర్మాత దిల్ రాజు చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడం వల్లనే విడుదలలో జాప్యం జరుగుతున్నట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఫస్ట్ కాపీ సిద్ధం కావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. అయితే, మహేష్ ఖలేజా భయంతోనే బృందావనం సినిమా విడుదలను వాయిదా వేసినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని దిల్ రాజు కొట్టిపారేస్తున్నారు. రెండేళ్లు కష్టపడి బృందావనం సినిమాను నిర్మించామని, పోస్టు ప్రొడక్షన్ వర్క్ సరిగా జరగకుండా విడుదల చేయడం తనకు ఇష్టం లేదని, ఫస్ట్ కాపీ సిద్ధం కావడానికి ఇంకా రెండు మూడు రోజులు పడుతుందని ఆయన అన్నారు.
కాగా, రజనీకాంత్ రోబో కూడా విడుదలై బాక్సాఫీసును బద్దలు కొడుతోంది. ఈ నెల 7వ తేదీన విడుదలయ్యే మహేష్ ఖలేజా కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ స్థితిలో బృందావనం సినిమాకు థియేటర్లు దొరకడం కూడా కాస్తా కష్టంగానే ఉంటుందని భావిస్తున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని బృందావనం సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్లు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











