జైలు నుంచి రియా చక్రవర్తి విడుదల.. 28 రోజుల తర్వాత ఇంటికి.. టెన్షన్, ఉత్కంఠల మధ్య!
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో అరెస్టైన రియా చక్రవర్తి బెయిల్పై విడుదలయ్యారు. డ్రగ్స్ రాకెట్ కేసులో ఆమెను సెప్టెంబర్ 9వ తేదీన నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే పలుమార్లు తిరస్కరణ తర్వాత రియాకు బాంబే హైకోర్టు బుధవారం (అక్టోబర్ 7న) బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమె జైలు నుంచి బయటపడుతుందా? రేపటి వరకు వేచి చూడాల్సిందేనా అనే టెన్షన్ వాతావరణ మధ్య రిలీజ్ అయ్యారు. రియా విడుదలకు ముందు నెలకొన్న ఉత్కంఠ సంఘటనలు ఏమిటంటే..

సమాజానికి ఏం సందేశం ఇస్తాం
రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేయడానికి ముందు ఎన్సీబీ అధికారులు తమ వాదనను బలంగా వినిపించారు. రియా, షోవిక్ లాంటి వారిని విడుదల చేస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళుతాయి. ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో యువతకు బలమైన హెచ్చరికలు చేయాల్సి ఉంది. ఇలా విడుదల చేస్తే సమాజానికి మనం ఏం సందేశం ఇస్తామని ఎన్సీబీ అధికారులు కోర్టులో వాదించారు. అయితే రియాకు బెయిల్ ఇస్తూ.. షోవిక్కు నిరాకరిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పావులు కదిపిన రియా లాయర్
రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేయగానే ఆమె తరపు న్యాయవాది సతీష్ మాన్షిండే చకచకా పావులు కదిపారు. సెషన్స్ కోర్టుకు బెయిల్ ఆర్డర్ను త్వరగా పంపించడం సఫలమయ్యారు. ఆ తర్వాత సెషన్ కోర్టు ఆమోదించగానే బైకూల్లా జైలుకు ఆదేశాలు పంపించారు. కోర్టు నుంచి వెంటనే రిలీజ్ ఆర్డర్ను తీసుకొని బైకుల్లా జైలుకు ప్రయాణమయ్యారు. ఇదంతా జరుగడానికి కనీసం మూడు గంటలు పట్టింది.

జైలులో ఉండాల్సిన పరిస్థితుల నుంచి
అయితే జైలు నిబంధనల ప్రకారం ఏ ఖైదీనైనా విడుదల చేయాలంటే సాయంత్రం 5 గంటలలోపే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. బైకుల్లా జైలులో ఫైనల్ డాక్యుమెంటేషన్ పూర్తి కాకపోతే మరో రోజు రియా చక్రవర్తి జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫైనల్ డాక్యుమెంట్ తర్వాత తన లాకర్లోని వస్తువులను తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా 5 గంటలలోపు పూర్తి కావాల్సి ఉంటుంది.

28 రోజుల తర్వాత జైలు నుంచి ఇంటికి
ఇలాంటి టెన్షన్ వాతావరణం మధ్య అన్ని ప్రక్రియలు సకాలంలో పూర్తయ్యాయి. దాంతో దాదాపు 28 రోజుల తర్వాత రియా చక్రవర్తికి జైలు నుంచి విముక్తి లభించింది. రియా బెయిల్ లభించడంపై లాయర్ సతీష్ మాన్షిండే సంతోషం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ, ఎన్సీబీ దారుణంగా రియాను వెంటాడాయని. ఆలస్యమైన సత్యమే విజయం సాధించింది. సత్యమేవ జయతే అని అన్నారు.
Recommended Video

జైలు నుంచి రియా ఇంటి వరకు మీడియాపై ఆంక్షలు
రియా చక్రవర్తి విడుదల సందర్భంగా బైకుల్లా జైలు వద్ద ముంబై పోలీసులు ఆంక్షలు విధించారు. మీడియాకు ప్రవేశం లేకుండా కట్టుదిట్టం చేశారు. బైకుల్లా జైలు నుంచి జుహులోని రియా నివాసం వరకు అంటే 20 కిలోమీటర్ల మేరకు మీడియా వెంటాడవద్దని మీడియాకు ముంబై పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అలా దాదాపు ఒక గంట ప్రయాణం చేసి జైలు నుంచి రియా తన ఇంటికి చేరుకొన్నారు.


Click it and Unblock the Notifications











