గోపీచంద్ 'సాహసం' విడుదల తేదీ ప్రకటన
హైదరాబాద్ : గోపీచంద్,యేలేటి చంద్రశేఖర్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'సాహసం' . ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. . వచ్చే నెల 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత అఫీషియల్ గా ప్రకటన చేసారు. ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం చిత్రాలు యేలేటి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ హీరోగా 'సాహసం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బి.వి. ఎస్.ఎన్పసాద్ నిర్మిస్తున్నారు . తాప్సి హీరోయిన్.
గోపీచంద్ మాట్లాడుతూ... ఓడలు బళ్లు కావడం సహజమే. తాతల కాలంనాటి కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులున్నా... వర్తమానంలో సాధారణ జీవితాన్ని గడిపేవాళ్లను చూస్తూనే ఉంటాం. అలాంటి సామాన్యుడే మా కథానాయకుడు. నీతినిజాయతీ లున్న అతగాడికి తన కుటుంబం గురించిన కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపు తిరిగిందో తెర మీదే చూడాలన్నారు .
తనకు ఎలాంటి అస్తిపాస్తులు లేవని భావించే ఓ సాధారణ సెక్యూరిటీ గార్డుకు అనుకోని సంఘటనల కారణంగా తనకూ ఆస్తి వుందని తెలుస్తుంది. దాన్ని దక్కించుకోవడం కోసం ఓ ప్రదేశానికి వెళతాడు. అప్పుడు ఏం జరిగిందన్నదే 'సాహసం' చిత్ర కథ. ఓ వ్యక్తి వ్యక్తిగత కథ ఇది. తన ప్రయాణంలో నిధి అన్వేషణ అనేది ఓ భాగంలా వుంటుందే కానీ పూర్తిగా నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే కథ మాత్రం కాదు అంటున్నారు యేలేటి చంద్రశేఖర్.
నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ''ఈ కథను చంద్రశేఖర్ తెరకెక్కించిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా పేరుకి తగ్గట్టే గోపీచంద్ సాహసోపేతంగా చేసిన పోరాటాలు అందర్నీ అలరిస్తాయి''అన్నారు. ఛాయాగ్రహణం: శామ్దత్.ఎస్., సంగీతం: శ్రీ, పాటలు: అనంత శ్రీరామ్, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్.


Click it and Unblock the Notifications












